ఇండియ‌న్స్‌పై జాత్య‌హంకార వ్యాఖ్య‌లు.. – మస్క్ టీమ్ ఇంజినీర్ రిజైన్‌

ఇండియ‌న్స్‌పై జాత్య‌హంకార వ్యాఖ్య‌లు.. - మస్క్ టీమ్ ఇంజినీర్ రిజైన్‌

అగ్ర‌రాజ్యం అధ్య‌క్షుడిగా రెండోసారి ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప‌లు వివాదాల‌కు కార‌ణం అవుతున్నాయి. అక్క‌డ నివ‌సించే విదేశీయుల‌నూ క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ముఖ్యంగా భార‌త విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భార‌తీయుల‌ను ఉద్దేశిస్తూ డీవోజీఈ టీమ్ ఇంజినీర్ చేసిన వ్యాఖ్య‌లు తాజాగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో అత‌ను రాజీనామా చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

టెస్లా, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) టీమ్ న‌డుస్తోంది. ఈ టీమ్‌లో పనిచేస్తున్న ఇంజినీర్ మార్కో ఇలెజ్ భారతీయులపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తాజాగా వైరల్ కావడంతో అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలెజ్ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసనల ప్రభావంతో మార్కో ఇలెజ్ తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

వివాదాస్పద వ్యాఖ్యలు..
అమెరికా మీడియా కథనాల ప్రకారం ఇలెజ్ గతంలో “నార్మలైజ్ ఇండియా హేట్” అనే పోస్టును షేర్ చేయడమే కాకుండా, హెచ్-1బీ వీసాదారులను ఉద్దేశించి “గోయింగ్ బ్యాక్ డోంట్ వర్రీ” అంటూ వివాదాస్పద కామెంట్లు చేశాడు. ఈ పోస్టులు వైరల్ కావడం, అత‌నిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తమ‌వ్వ‌డంతో అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు అతను రాజీనామా సమర్పించాడు.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత, భారతీయులతో పాటు అనేక దేశాల అక్రమ వలసదారులను అమెరికా నుంచి బలవంతంగా పంపించివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు మద్దతుగా ఉన్న ఇలెజ్, భారతీయులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత దుమారం రేపుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment