కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును టీడీపీ(TDP) కేడర్ టార్గెట్ చేసింది. కార్యకర్తలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళంలోని అరసవల్లి(Arasavilli Temple) సూర్యనారాయణ స్వామిని ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer Mangli) దర్శనం చేసుకున్నారు. దర్శన అనంతరం సింగర్ మంగ్లీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu)తో దిగిన ఫొటో ఒకటి బయటకు రాగా, ఈ ఫొటో చూసిన టీడీపీ కేడర్కు మింగుడుపడటం లేదు. మంత్రి రామ్మోహన్ నాయుడుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రథసప్తమి రోజున మంగ్లీ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం దర్శనం ఏర్పాట్లు చేశారు. అయితే, మంగ్లీ గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచార గీతాలు పాడడం టీడీపీ కేడర్కు నచ్చలేదు. ఇప్పుడు అదే మంగ్లీకి కేంద్ర మంత్రి దగ్గరుండి ప్రత్యేక దర్శనం చేయించారని వారంతా మండిపడుతున్నారు.
టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా మంత్రి రామ్మోహన్ నాయుడును తెగ ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ ప్రచారం గీతాలు పాడిన మంగ్లీకి ఎందుకు ప్రత్యేక దర్శనం కల్పించారని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కేడర్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తిగా ఉంది. మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమర్శలపై ఎలా స్పందిస్తారో చూడాలి. కార్యకర్తలకు క్షమాపణ చెప్పి విషయాన్ని సర్దుబాటు చేసుకుంటారా? లేక వివాదం ఇంకా ముదురుతుందా? అనేది వేచి చూడాలి.








