ఒకప్పుడు ప్రశాంతతకు నిలయంగా పేరొందిన కోనసీమ (Konaseema) ఇప్పుడు గంజాయి (Ganja) వాడకంతో హల్చల్ చేస్తోంది. జిల్లా కేంద్రం అమలాపురం నుంచి పల్లెటూర్ల వరకు గంజాయి విక్రయం విస్తరిస్తుండటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కళాశాలలు, విద్యాసంస్థల వద్ద గంజాయి విక్రయం పెరిగిపోవడం తీవ్ర సమస్యగా మారింది. ఇటీవల చోరీలు, ఇతర నేరాలకు సంబంధించి గంజాయి వినియోగమే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. బైక్ దొంగతనాల కేసుల్లో నిందితులను విచారించగా, వారు గంజాయి మత్తులో చోరీలకు పాల్పడ్డారని వెల్లడైంది.
గంజాయి రవాణా మార్గాలు
తూర్పు గోదావరి, విశాఖ ఏజెన్సీల నుంచి కొందరు దళారులు కోనసీమ ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ముమ్మిడివరం, కాట్రేనికోన, రాజోలు, సఖినేటిపల్లి, రావులపాలెం, అల్లవరం, ఆత్రేయపురం వంటి గ్రామాలకు మార్గాల ద్వారా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది.
పోలీసులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసి, గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టారు. పర్యవేక్షణ పెంచారు. అయినా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గంజాయి సేవిస్తూ ఆరుగురు పట్టుబడ్డారు. గంజాయి మత్తులో తూగుతున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోనసీమలో గంజాయి నియంత్రణపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. యువత మత్తుకు బానిస కాకుండా కాపాడేందుకు పోలీసులు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.