కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం కొత్త పంథాను ఎంచుకుంది. ప్రభుత్వ ప్రచారానికి సమాచార శాఖ ఉండగా, దాన్ని కాదని కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. పాన్ ఇండియా లెవల్లో సీఎం చంద్రబాబు తన ప్రభుత్వాన్ని పబ్లిసిటీ చేసుకునేందుకు కొత్త సంస్థను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఈ మేరకు న్యూస్ అండ్ కమ్యూనికేషన్ ఏజెన్సీ కోసం చంద్రబాబు ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానం పలికింది. ప్రభుత్వ ప్రచారానికి సమాచార శాఖ ఉండగా.. ఇప్పుడున్న పబ్లిసిటీ సరిపోవట్లేదని కొత్త ఏజెన్సీని ఆహ్వానిస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది.
వందల కోట్లతో ప్రభుత్వానికి ప్రచారం కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. పబ్లిసిటీ కంటెంట్, ప్రకటనలు అన్ని పత్రికలు, మీడియా, సోషల్ మీడియా ద్వారా ఏజెన్సీ ఇవ్వనుంది. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చెయ్యడంపై సమాచార శాఖ అధికారులు విస్తుపోతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పబ్లిసిటీ కోసం ఖర్చు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో ప్రచారం అంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, పరిపాలనా పథకాలపై తగిన సానుకూల ప్రచారం పొందడం లేదని, ప్రతికూల ప్రచారాన్ని కూడా తిప్పికొట్టలేకపోయిందని ప్రభుత్వం టెండర్ల ఆహ్వాన పత్రికలో పేర్కొంది. ప్రభుత్వం మరియు డిపార్ట్మెంట్ ప్రతిష్టను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించడం కోసం ఏజెన్సీ ఎంప్యానెల్మెంట్ ప్రభుత్వ ప్రతిష్టను మెరుగుపరుస్తుందని పేర్కొంది. వివిధ మార్కెట్లలో పాన్ ఇండియా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పబ్లిసిటీ కల్పించాలని పేర్కొన్నారు.
ఎంతసేపూ ప్రచార యావేనా..?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటిపోయినా.. ఇప్పటి వరకు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేసింది లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై దృష్టిపెట్టకుండా, పబ్లిసిటీపై ఫోకస్ పెట్టడాన్ని రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రజలు సైతం చంద్రబాబు ప్రచార యావపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ శ్రద్ధ పథకాలపై పెట్టొచ్చు కదా అని పెదవి విరుస్తున్నారు.