హైదరాబాద్లో జరిగిన మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకావిష్కరణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షం, పాలక పక్షం కలిసి పని చేస్తేనే ప్రభుత్వం సత్వరంగా అభివృద్ధి చెందుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
విద్యాసాగర్ రావు ప్రతిభకు ప్రశంసలు
సీహెచ్ విద్యాసాగర్ రావు తన సామర్థ్యంతో తమిళనాడు, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలకు గవర్నర్గా విశేష సేవలందించారని సీఎం రేవంత్ కొనియాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయన సామర్థ్యాన్ని గుర్తించారని తెలిపారు. విద్యాసాగర్ రావు ప్రారంభించిన గోదావరి జలాల వినియోగ ఆలోచన ఇంకా పూర్తిగా సాకారం కాలేదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ముంపునకు గురవుతోన్న భూమిని అందించినట్లయితే, తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను వినియోగించుకోవచ్చని సీఎం వివరించారు.
అభివృద్ధి పై చర్చ
రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్కు సంబంధించి ఇంకా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాజెక్ట్తో పాటు రీజినల్ రింగ్ లైన్ పై కూడా ప్రధాని మోడీతో చర్చలు జరిపినట్లు చెప్పారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీని తెలంగాణకు తీసుకురావడంపై దృష్టి పెట్టామని తెలిపారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను వేగవంతం చేయాలని కూడా ప్రధాని మోడీని కోరినట్లు పేర్కొన్నారు.