ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం గడుస్తున్నా సమస్యలు అలాగే ఉండిపోయాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పాలనలో ఉండటంతో విభజన హామీలు నెరవేరుతాయన్న నమ్మకం ఉందన్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తిపై తన ధీమాను వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు నీటి వివాదాలను స్వయంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఎన్నికలపై ఘాటు విమర్శలు
మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి దేశంలో పెరుగుతున్న అవినీతిని తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఎన్నికలంటే భయమేస్తోంది’ అంటూ, ఎన్నికల్లో డబ్బు దోపిడీ చేసే వారు పోటీ చేస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అలాంటి వారికే ఓటు వేయడం సమాజానికి తీరని నష్టం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, అవినీతి నిర్మూలన, ప్రజల చైతన్యం కోసం తనదైన శైలిలో కిరణ్ కుమార్ రెడ్డి సూచనలు చేశారు.








