నిజామాబాద్లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీరిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై దిల్రాజు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇటీవల నిజామాబాద్లో నిర్వహించారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో “నిజామాబాద్లో ఈవెంట్కు తక్కువ రియాక్షన్ ఉంది. ఆంధ్రాలో జరిగితే ప్రతి సినిమాకు ఒక వైబ్ వస్తుంది, కానీ తెలంగాణలో తెల్ల కల్లు, మటన్కే వైబ్ ఉంటుంది” అని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైరయ్యారు. సోషల్ మీడియాలో కూడా దిల్ రాజును ట్రోల్ చేస్తూ విపరీతమైన మీమ్స్ వచ్చాయి.
#DilRaju garu has spoken out about the Nizamabad incident, offering his sincere apologies to anyone who may have been hurt. He has requested not to associate him with politics in any way. pic.twitter.com/X9W3grU8O0
— Sri Venkateswara Creations (@SVC_official) January 11, 2025
క్లారిటీ ఇచ్చిన దిల్రాజు
నిజామాబాద్లో సినిమా ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొందరు రాద్ధాంతం చేస్తున్నారని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని దిల్రాజు ఓ వీడియో బైట్ విడుదల చేశారు. ‘తెలంగాణ వాళ్లను నేను అవమానించానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సంక్రాంతికి రెండు సినిమాలు విడుదలవుతుండటం వల్ల నేను తెలంగణ దావత్ను మిస్ అవుతున్నానని చెప్పా. సినిమా రిలీజ్ అయ్యాక తెలంగాణ దావత్ చేసుకుంటానని చెప్పా. తెలంగాణ వాసిగా నేను తెలంగాణను హేళన చేస్తానా..? తెలంగాణ సంస్కృతిని నేను అభిమానిస్తా. నా మాటలను అర్థం చేసుకోకుండా కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. నా మాటలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించండి. తెలంగాణలోని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా.. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు. ఎఫ్డీసీ రాజకీయాలకు వేదిక కాదు’ అని దిల్రాజు వ్యాఖ్యానించారు.