వాలంటరీ వ్యవస్థకు సంబంధించి కూటమి నేతల వైఖరి ప్రస్తుతం విమర్శలకు గురవుతోంది. ఎన్నికల ముందు వాలంటీర్లకు ఉపాధి భద్రత, రూ.10 వేల గౌరవ వేతనం అని హామీ ఇచ్చిన కూటమి నేతలు, ఇప్పుడు లీగల్ సమస్యలను కారణంగా చూపిస్తూ వాళ్లకు ఉపాధిని దూరం చేయడం గమనార్హం.
వాలంటీర్ వ్యవస్థపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటే లీగల్ సమస్యలు ఎదురవుతాయని స్పష్టం చేశారు. “పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతారు?” అంటూవాలంటీర్ వ్యవస్థ మద్దతు ఇవ్వకపోగా, ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు వాలంటీర్లలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
ఎన్నికల ముందు హామీ.. తరువాత మాటల మార్పు
కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు రూ.10,000 జీతం ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడంలో వెనుకంజ వేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా, విజయవాడలో వెనక్కి నడుస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. “ఇది యూటర్న్ ప్రభుత్వం” అంటూ వాలంటీర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.