ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న మంత్రి నారా లోకేష్పై మాజీ బ్యూరోక్రాట్స్, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థాయిని మించి ప్రవర్తించడం ఏంటని వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజే వాహనాలకు అనుమతుల అంశంపై మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ ఇటు మేధావులు, అటు సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీసింది. డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రిని కోరుతూనే.. ఒక్క డీజే వాహనాన్ని కూడా పోలీసులు జప్తు చేయొద్దని లోకేష్ ఎక్స్ వేదికగా ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది.
లోకేష్ ట్వీట్పై బ్యూరోక్రాట్ చురకలు
లోకేష్ చేసిన ట్వీట్పై మాజీ ఐఏఎస్ అధికారి పీవీఎస్ శర్మ ఘాటుగా స్పందించారు. “లోకేష్.. మీరు ఇంకా సీఎం కాలేదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కుమారుడైనంత మాత్రాన మరో మంత్రిని ఒక పని చేయొద్దని ఆదేశించే అధికారం ఉండదని, ప్రోటోకాల్, ప్రజాస్వామ్య మర్యాదలను ఉల్లంఘించకూడదనే కనీస ఇంగితం నారా లోకేష్కు లేకపోవడం శోచనీయమని మాజీ బ్యూరోక్రాట్ విస్మయం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు
ఇదే సమయంలో లోకేష్ ట్వీట్పై పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తనకు కేటాయించిన శాఖను సక్రమంగా నిర్వహించడంపై దృష్టి పెట్టాలని, ఇతర శాఖల వ్యవహారాల్లో అతి జోక్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఫిర్యాదులపై దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశాల్లో సవాళ్లు చేయడం కాకుండా, బయట కూడా అదే స్థాయిలో స్పందించాలని కామెంట్లు చేస్తున్నారు.
“మరో శాఖలో జోక్యం చేసుకునే హక్కు ఏంటి?”
డీజే వాహనాల విషయంలో పోలీసులకు నేరుగా ఆదేశాలు ఇవ్వడంపై కూడా నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. “ఇతరుల శాఖలో జోక్యం చేసుకోవడానికి మీకున్న హక్కు ఏంటి?, రాష్ట్రానికి ముఖ్యమంత్రివా.. లేక పవన్ కళ్యాణ్ మాదిరిగా నువ్వు ఏమైనా డిప్యూటీ సీఎంవా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరో మంత్రికి సంబంధించిన శాఖలో నిర్ణయాలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వడం ప్రోటోకాల్, పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చాగంటి వ్యాఖ్యలను విస్మరించిన లోకేష్
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురించి వేదికలపై గొప్పగా చెప్పే నారా లోకేష్.. ప్రవచనకర్త వ్యాఖ్యలను విస్మరించడం కూడా చర్చనీయాంశంగా మారింది. గతేడాది “నిమజ్జనంలో డీజేలు, శబ్ద కాలుష్యం, వికృత పోకడలు అపచారం” అని బ్రహ్మశ్రీ చాగంటి వ్యాఖ్యలతో టీడీపీ ట్వీట్ చేసింది. కానీ, ఈ ఏడాది డీజేలకు అనుమతిస్తూ హోం మంత్రి, డీజీపీకి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేయడంతో జెన్ జీ ఆక్రోశానికి చాగంటి వ్యాఖ్యలను సైతం నారా లోకేష్ విస్మరించాడని విస్మయాలు వ్యక్తం అవుతున్నాయి.









