ఆంధ్రప్రదేశ్లో కరువు తాండవిస్తోంది. అంతే రేంజ్లో నిత్యావసర సరుకుల ధరలు ప్రజలను దారుణంగా వేధిస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం తీవ్రంగా తగ్గింది. ఆగస్టు నెలలో వర్షపాతం భారీగా పడిపోవడంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే దాదాపు 45 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడటంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.
జూన్ 1 నుంచి జూలై చివరి వరకు ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం లోటు 38 శాతంగా ఉండగా.. ఆగస్టు ముగిసే నాటికి అది దాదాపు 45 శాతానికి పెరిగింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య రాష్ట్రంలో 369.5 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 204.3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దేశవ్యాప్తంగా ఇదే కాలంలో వర్షపాతం లోటు సుమారు 14 శాతంగా ఉండగా.. ఏపీలో 45 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాలు ప్రస్తుతం వర్షపాతం లోటును ఎదుర్కొంటున్నాయి. వీటిలో 25 జిల్లాలు ‘లోటు’ కేటగిరీలో ఉండగా.. అన్నమయ్య, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఈ మూడు జిల్లాలు ‘తీవ్ర లోటు’ కేటగిరీలో ఉన్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి.
జిల్లాల వారీగా చూస్తే అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా 69 శాతం వర్షపాతం లోటు నమోదైంది. బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో 59 శాతం చొప్పున లోటు ఉంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అనంతపురం జిల్లాల్లో అత్యల్పంగా 24 శాతం వర్షపాతం లోటు నమోదైంది.
వర్షాభావం కారణంగా ఖరీఫ్ సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయింది. 2026 ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 20.35 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 25.63 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. సాధారణ వర్షాలు లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు ఇప్పటికే సాగు చేసిన పంటల పరిస్థితిపైనా ఆందోళన నెలకొంది.
ముఖ్యంగా వరి సహా పలు ఖరీఫ్ పంటలు వర్షాలపై ఆధారపడి ఉండటంతో.. రానున్న వారాల్లో వర్షాలు కురవకపోతే దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వర్షపాతం అసమానంగా ఉండటానికి ఎల్నినో పరిస్థితులు కూడా ఒక కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆగస్టులో వర్షపాతం తీవ్రంగా తగ్గిపోవడంతో రాష్ట్రంలో రుతుపవనాల పరిస్థితి మరింత బలహీనపడింది. ఆగస్టు ఈ ఏడాది అత్యంత పేలవమైన రుతుపవన నెలగా నిలిచిందని వాతావరణ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఆగస్టు నెల మొత్తం నెలకొన్న సుదీర్ఘ పొడి వాతావరణంతో పలు జిల్లాల్లో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సాగు చేసిన పంటలకు అవసరమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. రానున్న కొన్ని వారాల్లో వర్షాలు పుంజుకుంటే పంటలకు కొంత ఊరట లభించే అవకాశం ఉందని, లేకపోతే గణనీయమైన పంట నష్టం సంభవించే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








