హైదరాబాద్లోని(Hyderabad) ఐటీ కారిడార్(IT Corridor) రాయదుర్గంలో(Raidurg) నిర్వహించిన భూముల ఈ-వేలానికి (Land E-Auction) పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) (TGIIC) నిర్వహించిన వేలంలో భూములు ప్రతిపాదిత రిజర్వ్ ధర కంటే 52.3 శాతం అధిక ధరకు అమ్ముడయ్యాయి. హైదరాబాద్లోని మెరుగైన మౌలిక వసతులు, రవాణా అనుసంధానం, వ్యాపార అనుకూల వాతావరణమే ఈ భారీ డిమాండ్కు కారణమని అధికారులు తెలిపారు.
తాజాగా నిర్వహించిన 5.38 ఎకరాల ప్లాట్-P2 ఈ-వేలంలో ఎకరాకు రూ.269 కోట్లు ధర పలికింది. దీంతో ప్రభుత్వానికి(Government) రూ.1,447.22 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు జరిగిన ప్లాట్-P1 వేలంలో ఎకరాకు రూ.264 కోట్ల చొప్పున రూ.1,386 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో వారం రోజుల్లోనే మొత్తం 10.63 ఎకరాల రెండు ప్లాట్ల ద్వారా రూ.2,833.22 కోట్ల భారీ రాబడి లభించింది. సగటున ఎకరా ధర రూ.266.53 కోట్లుగా నమోదైంది.
ఎమ్ఎస్టీసీ(MSTC) ఈ-ఆక్షన్ ప్లాట్ఫామ్ (E-Auction Platform) ద్వారా జరిగిన ఈ ప్రక్రియకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సలహా సంస్థ జేఎల్ఎల్ (JLL) సహకరించింది. ఈ రికార్డు ధరలు తెలంగాణ ప్రభుత్వ(Telangana Government) పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ కె. శశాంక్ (K. Shashank) ఐఏఎస్ తెలిపారు. పారదర్శక వేలం ద్వారా ప్రభుత్వ ఆస్తులకు గరిష్ఠ విలువను సమకూర్చడంలో రాయదుర్గం ఈ-వేలం మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.








