తెలంగాణలో(Telangana) సినిమా టికెట్ ధరల స్థిరీకరణ(Ticket Prices Regulation), థియేటర్ల నిర్వహణకు (Theatres Management) సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 77పై తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ (Telangana Exhibitors Association) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ జీవోను పునఃసమీక్షించాలని, అవసరమైన మార్పులు చేయాలని లేదా పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Revanth Reddy) లేఖ రాసింది.
తెలంగాణలోని 33 జిల్లాల్లో ఉన్న 400కుపైగా థియేటర్ల ప్రతినిధులను సంప్రదించకుండానే జీవో 77ను జారీ చేశారని ఎగ్జిబిటర్లు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంబంధిత సంస్థలతో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలుగు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్(Telugu Active Producers Guild), కొంతమంది నిర్మాతల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రభుత్వం జీవో జారీ చేయడం వల్ల థియేటర్ల యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలో 400కుపైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తెలిపింది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 పట్టణాల్లో ఉన్న థియేటర్లలో 99 శాతం ఏయిర్ కూల్డ్ థియేటర్లేనని పేర్కొంది. కోవిడ్ తర్వాత థియేటర్లను ఆధునికీకరించేందుకు యాజమాన్యాలు భారీగా పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 390కిపైగా ఏయిర్ కూల్డ్ థియేటర్లు, 350కుపైగా మల్టీఫ్లెక్స్ స్క్రీన్లు ఉన్నాయని వెల్లడించింది.
తెలంగాణలోని థియేటర్ వ్యవస్థతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20 వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని ఎగ్జిబిటర్లు తెలిపారు. సినిమా టికెట్ ధరలు, థియేటర్ల నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు ఈ రంగంపై ఆధారపడుతున్న కుటుంబాలు, ఎగ్జిబిటర్ల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
జీవో 77ను ప్రభుత్వం పునఃసమీక్షించి, ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపిన అనంతరం తగిన మార్పులు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. లేకపోతే జీవోను రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరింది.








