దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) భారీ వర్షం (Heavy Rains) ప్రభావంతో జనజీవనం స్తంభించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన రాకపోకలకు (Flight Operations) తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా మొత్తం 15 విమానాలను (Flights) ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించారు.
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో 12 విమానాలను జైపూర్కు(Jaipur), రెండు విమానాలను చండీగఢ్కు(Chandigarh), మరో విమానాన్ని లక్నోకు (Lucknow) మళ్లించినట్లు అధికారులు తెలిపారు. వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్, ల్యాండింగ్ ప్రక్రియలకు అంతరాయం ఏర్పడటంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
మరోవైపు భారీ వర్షాలతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై(Roads) నీరు నిలిచిపోయింది. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్లు (Traffic Jams) ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వర్షాల ప్రభావంతో మరిన్ని ప్రాంతాల్లో నీటిముంపు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.








