‘పుష్ప సినిమా’ త‌ర‌హాలో.. ఏపీకి భారీగా గోవా మద్యం

'పుష్ప సినిమా' త‌ర‌హాలో.. ఏపీకి భారీగా గోవా మద్యం

Summarize with AI

ఏపీలో క‌ల్తీ మ‌ద్యం త‌యారీతో మందుబాబుల్లో భ‌యాందోళ‌నలు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇత‌ర రాష్ట్రాల నుంచి గుట్టుచ‌ప్పుడు కాకుండా మ‌ద్యం అక్ర‌మ ర‌వాణా చేస్తూ ఓ ముఠా పట్టుబ‌డింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమంగా తరలిస్తున్న భారీగా గోవా మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తాడిపత్రి రైల్వే స్టేషన్‌ ఫ్లైఓవర్‌ సమీపంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. లారీలో తరలిస్తున్న సుమారు 400 ఫుల్‌ బాటిళ్ల గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పుష్ప సినిమాలో ఎర్ర‌చంద‌నం దుంగ‌ల ర‌వాణాను త‌ల‌ద‌న్నేలా మ‌ద్యం బాటిళ్ల ర‌వాణాను ప్లాన్ చేయ‌డం గ‌మ‌నార్హం. మద్యం బాటిళ్లు పోలీసులకు కనిపించకుండా లారీలో ప్రత్యేకంగా బాక్సులను ఏర్పాటు చేసినట్లు వీడియోల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. లారీ డెకరేషన్‌ మాటున ఈ బాక్సులను ఏర్పాటు చేసి వాటిలో మద్యం బాటిళ్లను దాచినట్లు పోలీసులు గుర్తించారు.

పట్టుబడిన మద్యంలో సుమారు 400 ‘మ్యాన్షన్‌ హౌస్‌’ ఫుల్‌ బాటిళ్లు ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర సరిహద్దులు దాటి గోవా నుంచి అనంతపురం జిల్లాకు అక్రమంగా మద్యం తరలిస్తున్న ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లారీకి రెండు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకటి కర్ణాటక రిజిస్ట్రేషన్‌ కాగా.. మరోటి ఏపీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే రెండు నంబర్‌ ప్లేట్లు ఉపయోగించారా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గోవా నుంచి మద్యాన్ని ఎవరి కోసం తరలిస్తున్నారు? తాడిపత్రిలో ఏయే మద్యం దుకాణాలకు సరఫరా చేయాలని భావించారు? ఈ వ్యవహారం వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులు ఎవరు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తాడిపత్రిలోని వివిధ మద్యం షాపులకు అక్రమంగా సరఫరా చేసేందుకే ఈ మద్యాన్ని తరలిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు సమాచారం. పూర్తి దర్యాప్తు అనంతరం అక్రమ మద్యం రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment