సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) క్లీన్చిట్ ఇచ్చింది. ఇదే కేసులో ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా ఎలాంటి ప్రమేయం లేదని తేల్చి, ఆయనకూ సిట్ క్లీన్చిట్ ప్రకటించింది.
ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును పూర్తి చేసిన సిట్ బృందం తన తుది నివేదికను ఉత్తరప్రదేశ్ హోంశాఖకు సమర్పించింది. ప్రభుత్వ పరిశీలన అనంతరం తదుపరి చర్యల నిమిత్తం ఈ నివేదికను రామమందిర ట్రస్ట్కు అందజేశారు.
లక్నో డివిజనల్ కమిషనర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరిపింది. విరాళాల సేకరణ, లెక్కింపు గదిలోని భద్రతా విధానాలు, సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించిన అధికారులు కీలక విషయాలు వెలుగులోకి తెచ్చారు. ఆలయ విరాళాల లెక్కింపు గది నుంచి నగదు వివిధ మార్గాలుగా దాదాపు 70 సార్లు చోరీకి గురైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిందితులు విరాళాల నగదును గోప్యంగా దాచిపెట్టి బయటకు తరలిస్తున్న దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బలమైన ఆధారాలతో సిట్ బృందం నిరూపించింది.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తగిన ఆధారాలు సేకరించి 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సిట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం వీరంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రామమందిర విరాళాల నిర్వహణలో అక్రమాలు, చోరీ ఘటనలు తెరపైకి రావడంతో గతంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదం నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవులకు జూన్ 27న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఈ చోరీ వ్యవహారంపై తొలుత తన దృష్టికి వచ్చిన వెంటనే తానే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసి, విచారణకు పూర్తిస్థాయిలో సహకరించినట్లు చంపత్ రాయ్ తెలిపారు. తాజాగా సిట్ తుది నివేదికలో ఆయనకు క్లీన్చిట్ లభించడం గమనార్హం.









రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది