జ‌న‌సేన Vs టీడీపీ.. ఒంగోలులో తారాస్థాయికి పోరు

ఒంగోలులో జ‌న‌సేన వ‌ర్సెస్ టీడీపీ.. తారాస్థాయికి పోరు

Summarize with AI

అధికార కూటమిలో ఇన్నాళ్లుగా నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న జ‌న‌సేన‌-టీడీపీ మ‌ధ్య విభేదాలు ఒక్క‌సారిగా బ‌ట్ట‌బ‌య‌లు అయ్యాయి. జనసేన సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరింది. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు క‌నీస గౌర‌వ మ‌ర్యాదలు ద‌క్క‌డం లేద‌ని, టీడీపీ ఎమ్మెల్యే అక్ర‌మ దందాలు, వ‌సూళ్ల గురించి బాలినేని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇద్దరు నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు, సవాళ్లు విసురుకోవడంతో ఒంగోలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు
ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అవినీతి, అక్రమాలు తారాస్థాయికి చేరాయని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా స‌మావేశంలో పలు కీలక విషయాలను వెల్లడించారు.

నియోజకవర్గంలో రేషన్ మాఫియా నుంచి ఎమ్మెల్యే దామచర్ల ప్రతి నెలా రూ. 25 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మద్యం దుకాణాలు, ఇసుక, గ్రావెల్, భూకబ్జాలు, మెప్మా, నగరపాలక సంస్థ కేంద్రంగా భారీ అవినీతి జరుగుతోందని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లే అడ్డాగా సెటిల్‌మెంట్లు నడుస్తున్నాయని విమర్శించారు. అవినీతి ఆరోపణలపై వీఆర్‌కు వెళ్లిన తాలూకా సీఐ విజయకృష్ణను వారం తిరగకుండానే మళ్లీ అదే స్థానంలో పోస్టింగ్ వేయించుకున్నారని ఆరోపించారు.

వెంకట సుబ్బారావుకు చెందిన భూ వివాదంలో పోలీస్ స్టేషన్‌కు పిలిచి బలవంతంగా రాజీ చేయించి సంతకాలు తెపించుకున్నారని, ఇందుకు సంబంధించిన పంచాయితీ వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు. ఇకపై తాను ఒంగోలులోనే ఉంటూ అన్ని అక్రమాలను నిరూపిస్తానని, అమీతుమీ తేల్చుకుంటానని బాలినేని స్పష్టం చేశారు.

టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల కౌంటర్
బాలినేని ఆరోపణలపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ దీటుగా బదులిచ్చారు. బాలినేని వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి జనసేన పార్టీని అడ్డం పెట్టుకుని వైసీపీ వాళ్ల కోసం పనిచేస్తున్నారని, కూటమిలో విభేదాలు సృష్టించేందుకే ఈ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

బాలినేని చేసిన తప్పులు ముద్రిస్తే కరపత్రాలు సరిపోవని, అమావాస్యకు, పౌర్ణమికి ఒంగోలు వచ్చే ఆయనకు తనపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో బాలినేని, ఆయన కుమారుడు బారు షాపులను సిండికేట్ చేసి కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, దీనిపై కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని, దమ్ముంటే బాలినేని కూడా రావాలని సవాల్ విసిరారు. కూటమిలో ఉన్నారనే ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని, రౌడీయిజం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కూటమిలో లుకలుకలు బహిర్గతం
ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జనసేన- టీడీపీ ఎమ్మెల్యే మధ్య ఈ స్థాయిలో మాటల యుద్ధం నడుస్తుండటం కూటమి రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఒకరిపై ఒకరు భూకబ్జాలు, వసూళ్ల దందాలు, అవినీతి ఆరోపణలు గుప్పించుకోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతాయోననే ఉత్కంఠ నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment