వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “తల్లికి వందనం” పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి కోసం ప్రత్యేకంగా రూ.15,000 అందించనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తల్లికి వందనం పథకం అమలు వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. అర్హత కలిగిన పిల్లల తల్లులకు రూ.15 వేల చొప్పున అందించనుంది. ఈ పథకం అమలుకు విధివిధానాలను త్వరలో ప్రభుత్వం ఖరారు చేయనుంది.
అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పి, మొదటి ఏడాది పథకం అమలు చేయకుండా విద్యార్థులను, వారి తల్లులను మోసం చేశాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ పథకం సంక్రాంతికి వస్తుందని ఆశించిన తల్లులకు నిరాశే ఎదురైందని విమర్శలు చేస్తున్నారు. రూ.15 వేలు లేనట్లే అని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.








