తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన పదవీకాలంపై కీలక వ్యాఖ్యలు చేశారు. “2034 వరకు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా(CM) ఉంటాను. దీనిపై ఎవరూ ఎలాంటి అనుమానాలు, డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు” అని ధీమా వ్యక్తం చేశారు. ఫిన్లాండ్(Finland), జర్మనీ (Germany) పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం ఎంసీఆర్హెచ్ఆర్డీలో (MCRHRD) ఉపాధ్యాయ సంఘాల (Teachers Associations) ప్రతినిధులతో సమావేశమైన సీఎం, ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మానవత్వంతో పాలన సాగిస్తోందని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యతను పూర్తిగా తానే తీసుకుంటానని హామీ ఇచ్చిన ఆయన, ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు తమ దృష్టిని పూర్తిగా విద్యార్థుల భవిష్యత్తు(Students Future), ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) మౌలిక వసతుల మెరుగుదలపై కేంద్రీకరించాలని సూచించారు. ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం సులభమని, కానీ ఉపాధ్యాయ వ్యవస్థ అత్యంత శక్తివంతమైనదని కొనియాడుతూ, బడులలోని పిల్లల సమస్యలపై నేరుగా తనతో చర్చించేందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను మరింత పెంచడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “ప్రభుత్వ బడిలో చదివితే ఏం అవుతావు?” అని ఎవరైనా అడిగితే, “తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాను” అని విద్యార్థులు ధైర్యంగా చెప్పే పరిస్థితి రావాలని అన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే (Government Schools) చదువుకుని, మంత్రి పదవి అనుభవం లేకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని గుర్తుచేశారు. ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో (Harvard University) చదివిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, కేవలం తెలివి మాత్రమే కాకుండా క్రమశిక్షణ కూడా విజయానికి కీలకమని చెప్పారు. 2024 జనవరి నుంచి ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సైతం సమయానికి వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. హాస్టళ్లలో డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, అమెరికాపైనే కాకుండా జర్మనీ, జపాన్ వంటి దేశాల వైపు కూడా విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై వారి సమస్యలను పరిష్కరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు.








