సుప్రీంకోర్టు (Supreme Court) లైవ్ స్ట్రీమింగ్లో (Live Streaming) కీలక మార్పు చోటుచేసుకుంది. ఇకపై అత్యవసర కేసుల ప్రస్తావన (మెన్షనింగ్) సమయంలో జరిగే సంభాషణల ఆడియో ప్రజలకు వినిపించదు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) (CJI) ముందు న్యాయవాదులు (Lawyers) అత్యవసర విచారణ కోరుతూ చేసే అభ్యర్థనలు, వాటిపై కోర్టు ఇచ్చే మౌఖిక స్పందనలు, ప్రాథమిక వ్యాఖ్యల ఆడియోను మ్యూట్ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో లైవ్ వీడియో (Live Video) యథావిధిగా ప్రసారమైనప్పటికీ, ఆ సమయంలో జరిగే సంభాషణలు మాత్రం వినిపించవు. అత్యవసర కేసుల మెన్షనింగ్ అనేది న్యాయ విచారణ కాదని, కేవలం పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని ప్రధాన న్యాయమూర్తి ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో రాజకీయ ప్రాధాన్యత ఉన్న కేసులు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (PILలు) మెన్షనింగ్ (Mentioning) సమయంలో ప్రధాన న్యాయమూర్తి చేసిన ప్రాథమిక వ్యాఖ్యలను మీడియా విస్తృతంగా ప్రచారం చేయడంతో అవి కేసు విచారణ ప్రారంభానికి ముందే చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయడంతో పాటు, పరిపాలనా ప్రక్రియను అసలు న్యాయ విచారణ నుంచి స్పష్టంగా వేరు చేయాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. వర్చువల్ కోర్టు (Virtual Court) వ్యవస్థలో ఇది ఒక కీలక మార్పుగా న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. కేసుల జాబితా ఖరారు చేసే పరిపాలనా దశలో జరిగే సంభాషణలు ఇకపై బహిరంగంగా వినిపించకపోవడంతో, కోర్టు విచారణ ప్రారంభానికి ముందే అనవసర వ్యాఖ్యానాలు, చర్చలకు కొంత మేర అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.








