గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత క్రీడాకారులు మరోసారి సత్తా చాటారు. 65 కేజీల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్లిఫ్టర్ రాజా ముత్తుపాండి అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి మరో గర్వకారణంగా నిలిచాడు. ఫైనల్లో స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో కలిపి 286 కిలోగ్రాములు ఎత్తిన రాజా రెండో స్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో మలేషియాకు చెందిన **అజ్నిల్ బిన్ బిదిన్ ముహమ్మద్ మొత్తం 299 కిలోగ్రాములు ఎత్తి ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా, పాపువా న్యూ గినియాకు చెందిన మోరేయా బారు కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్-2026లో వెయిట్లిఫ్టింగ్, పవర్ వెయిట్లిఫ్టింగ్ విభాగాల్లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరుకుంది.
రాజా ముత్తుపాండి విజయం వెనుక ఎన్నో కష్టాలు, సవాళ్లు ఉన్నాయి. 2019లో లిగమెంట్ గాయం కారణంగా కీలక టోర్నీలకు దూరమైన ఆయన, శస్త్రచికిత్స అనంతరం మళ్లీ కఠిన సాధనతో పునరాగమనం చేశాడు. 2024లో జాతీయ రికార్డును బద్దలు కొట్టిన రాజా, 2025 కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో రజత పతకం సాధించి తన ఫామ్ను నిరూపించాడు. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్లో మరోసారి రజతం గెలవడంతో భారత క్రీడా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో భారత్కు పతకం అందించడమే తన తదుపరి లక్ష్యమని చెబుతున్న రాజా ముత్తుపాండి, తన పట్టుదలతో యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.









ముదురుతున్న వివాదం.. బోండా ఉమ వర్సెస్ టీడీపీ!