నీట్ వివాదంపై కేంద్రంపై రేవంత్ ఫైర్..

నీట్ వివాదంపై కేంద్రంపై రేవంత్ ఫైర్..

Summarize with AI

ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానికి చెందిన ‘56 అంగుళాల ఛాతీ’ యువశక్తి ముందు మరోసారి తలవంచిందని, విద్యార్థుల నిరసనల ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. రైతుల దీర్ఘకాల పోరాటం ఫలితంగా గతంలో నల్ల చట్టాలను కేంద్రం రద్దు చేసిందని గుర్తుచేస్తూ, ఇప్పుడు నీట్ (NEET) వివాదంలో విద్యార్థుల ఆగ్రహం కేంద్ర విద్యాశాఖ వైఫల్యాన్ని బయటపెట్టిందన్నారు. నీట్ వ్యవహారంలో నష్టపోయిన విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని, నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ‘జై జవాన్, జై కిసాన్’ నినాదానికి ఇకపై ‘జై యువా’ కూడా జోడించాల్సిన సమయం వచ్చిందని పేర్కొంటూ, ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల బెదిరింపులకు నేటి యువత ఏమాత్రం భయపడదని స్పష్టం చేశారు.

యువతకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా కీలక ప్రతిపాదనను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 నుంచి 21 ఏళ్లకు, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుల అభ్యర్థిత్వ వయస్సును 30 నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై రాబోయే ఆగస్టులో తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చి కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గాల డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులతో పాటు పోటీ వయోపరిమితి తగ్గింపు బిల్లును కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్న ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment