టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో తన ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ కౌంటీ క్లబ్ యార్క్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్న కుల్దీప్, ఈ సీజన్లో జట్టు తరఫున మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడనున్నాడు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో ఒక్క మ్యాచ్లో కూడా తుది జట్టులో చోటు దక్కకపోవడం, జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్కూ ఎంపిక కాకపోవడంతో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కౌంటీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ శుక్రవారం గ్లామోర్గన్తో జరిగే వన్డే కప్ మ్యాచ్ ద్వారా యార్క్షైర్ తరఫున అరంగేట్రం చేయనున్నాడు.
యార్క్షైర్తో ఒప్పందం కుదరడం తనకు గౌరవంగా ఉందని కుల్దీప్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం ఎప్పుడూ సవాలేనని, జట్టు విజయాలకు తన వంతు సహకారం అందించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. మరోవైపు యార్క్షైర్ జనరల్ మేనేజర్ గావిన్ హామిల్టన్ కూడా కుల్దీప్ను ప్రపంచ స్థాయి స్పిన్నర్గా అభివర్ణిస్తూ, సీజన్ చివరి దశలో అతని లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ జట్టుకు పెద్ద బలంగా మారుతుందని వెల్లడించాడు. శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్కు ముందు మ్యాచ్ ఫిట్నెస్, రిథమ్ను మెరుగుపరుచుకోవడంలో ఈ కౌంటీ అనుభవం కుల్దీప్కు ఎంతగానో ఉపయోగపడనుంది.








