బంగ్లాదేశ్కు చెందిన జమాత్-ఉల్-ముజాహిదీన్ (JMB) నాయకుడు జహీదుల్ ఇస్లాం భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు గాను బెంగళూరులోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక కోర్టు అతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అంతేకాకుండా రూ.57,000 జరిమానా కూడా విధించింది.
జహీదుల్ ఇస్లాం 2014లో భారతదేశంలో అక్రమంగా ప్రవేశించి, పలు ఉగ్ర కుట్రలను పథకం వేసినట్లు NIA తన దర్యాప్తులో వెల్లడించింది. అతను 2014 అక్టోబర్లో బుర్ద్వాన్ పేలుడుతో పాటు, 2018 జనవరిలో బుద్ధగయాలో జరిగిన పేలుడు వెనుక కీలక పాత్ర పోషించాడు. జహీదుల్ తన ఉగ్ర కుట్రలను మరింత విస్తరించేందుకు పశ్చిమ బెంగాల్, అస్సోం ప్రాంతాల నుంచి యువకులను రిక్రూట్ చేసి, వాటిని భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించాడు.
ఉగ్రవాదులకు గట్టి ఝలక్
NIA దర్యాప్తులో మొత్తం 11 మంది నిందితులకు ఇప్పటి వరకు శిక్షలు పడినట్లు అధికారులు వెల్లడించారు. జహీదుల్ ఇస్లాం భారతదేశంలో ఉన్న ఉగ్రవాద దాడుల ప్రణాళికల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా, మందుగుండు సామగ్రి సేకరణ, నిధుల సేకరణ వంటి కార్యకలాపాలలో కూడా పాల్గొన్నట్లు తేలింది.