ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా తీరప్రాంత జిల్లాల వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న వారం రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడి తీవ్ర రూపం దాల్చనుంది
అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనుండటంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు కీలక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని ప్రధాన పోర్టులకు 3వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
రానున్న 24 గంటల్లో అల్పపీడన ప్రభావం కోస్తాంధ్రపై తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలతో పాటు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
తీరంలో వాతావరణం అనుకూలంగా లేనందున, వేగంగా ఈదురుగాలులు వీస్తున్నందున కోస్తా తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే సమీప తీరాలకు సురక్షితంగా చేరుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.







