ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ కేసుల గురించి భయపడేది లేదని, తనపై తనకు నమ్మకం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించిన కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ క్యాడర్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం పెరిగిందని తెలిపారు.
కేసులకు బలం లేదు
“ఏసీబీ కేసులో బలం లేదని అందరికీ తెలుసు. నేను మాట మార్చలేదు. చెప్పినదానికే కట్టుబడి ఉన్నాను. ఫార్ములా ఈ-కారు రేసు కోసం నేను డబ్బులు కట్టమన్నా, అయితే ప్రొసీజర్ ప్రకారం జరగకపోతే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? డబ్బులు ముట్టిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు.
కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి మాట్లాడుతూ “ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్కు బాగా తెలుసు. 24 ఏళ్లుగా కేసీఆర్ కష్టపడ్డారు. ఇప్పుడు ఆయన కొంత విరామం తీసుకుంటున్నారు” అని కేటీఆర్ చెప్పారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నికలు జరుగుతాయని, బలమైన సంస్థాగత కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
పీవీకి గౌరవం దక్కే వరకు పోరాడతాం
తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు మీద కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని కేటీఆర్ ఆరోపించారు. “ఢిల్లీ పీవీకి మెమోరియల్ కట్టాలన్న తీర్మానం ఎందుకు చేయరు? మరణంలో కూడా పీవీకి గౌరవం ఇవ్వలేదు. పీవీకి గౌరవం దక్కేవరకు బీఆర్ఎస్ రాజ్యసభలో కఠినంగా పోరాడుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.