ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) మద్యం అమ్మకాలను (Liquor Sales) పెంచి, ఖజానా (State Treasury) నింపుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేట్ వైన్ షాపులు (Private Wine Shops), పర్మిట్ రూమ్ల (Permit Rooms) పేరిట మద్యం ఏరులై పారుతుండగా.. తాజాగా విమానాశ్రయాల్లోనూ మద్యం దుకాణాలు, బార్ల ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి (Tirupati) మినహా రాష్ట్రంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో (Airports) 24 గంటల పాటు మద్యం విక్రయాలు జరిపేలా కొత్త ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎయిర్పోర్టుల్లో (Airports) వైన్స్(Wines), బార్ల (Bars) ఏర్పాటు కోసం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ద్వారా కోట్ల రూపాయల రాబడిని ఆశిస్తోంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం లగ్జరీ మద్యం అమ్మకాలపై భారీగా పన్నులు వసూలు చేయనున్నారు.
ఎయిర్పోర్టులో బార్ లైసెన్స్ దరఖాస్తు రుసుముగా రూ. 5 లక్షలు, వైన్ షాపు(Wine Shop) దరఖాస్తు రుసుముగా రూ. 2 లక్షలు నిర్ణయించారు. ఎయిర్పోర్టుల్లో ఏర్పాటు చేసే ఒక్కో వైన్ షాపునకు ఎక్సైజ్ ట్యాక్స్ (Excise Tax) కింద ఏకంగా రూ. 1 కోటి వసూలు చేయనున్నారు. 20 లక్షల కంటే ఎక్కువ ప్రయాణికుల సర్క్యులేషన్ ఉన్న ఎయిర్పోర్టుల్లో బార్లకు ఎక్సైజ్ ట్యాక్స్ (Excise Tax) రూ. 25 లక్షలుగా.. 20 లక్షల లోపు సర్క్యులేషన్ ఉంటే రూ. 15 లక్షలుగా ఖరారు చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికే నూతన మద్య విధానం పేరుతో ప్రైవేటు వ్యక్తులకు వైన్ షాపులు అప్పగించి, పర్మిట్ రూమ్ల ద్వారా వీధివీధికీ మద్యాన్ని చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే పర్యాటకం పేరుతో రాష్ట్రంలోని బీచ్లలో ‘బీచ్ షాక్స్'(Beach Shacks) ఏర్పాటు చేసి మద్యం విక్రయాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఎయిర్పోర్టులను సైతం మద్యం కేంద్రాలుగా మార్చడానికి సిద్ధపడటం గమనార్హం.
తిరుపతి పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడి ఎయిర్పోర్టుకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, మిగిలిన అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంచడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విమాన ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. అపరిమితంగా మద్యం అమ్మకాలు జరపడం వల్ల అనుకోని ఘర్షణలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని, సమాజ శ్రేయస్సును విస్మరిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.








