తెలంగాణ (Telangana) ప్రభుత్వ ఉద్యోగులు (Government Employees) , కాంట్రాక్ట్ (Contract), ఔట్సోర్సింగ్ (Outsourcing) సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉద్యోగులందరికీ గరిష్టంగా రూ.1 కోటి వరకు ప్రమాద బీమా (Accident Insurance) కల్పించేలా ప్రముఖ బ్యాంకులతో (Banks) ప్రభుత్వం (Government) అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకుంది.
ఈ పథకం ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తెలిపారు. ఇప్పటికే సింగరేణికి (Singareni) చెందిన 45 మంది కార్మికులకు (Workers) ఈ బీమా వర్తింపజేసినట్లు వెల్లడించారు. ఇదే సందర్భంగా “నేను గుంపు మేస్త్రినే.. రేవంతన్న అని పిలిస్తేనే నాకు ఆనందం” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని (Financial Condition) మరింత బలోపేతం చేయాలంటే ఉద్యోగులంతా రోజుకు అదనంగా ఒక గంట పని చేయాలని సీఎం పిలుపునిచ్చారు. పన్నులు ఎగవేస్తున్న వారిని గుర్తించి బకాయిలను కఠినంగా వసూలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించిన ఆయన, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ రేట్లను 11 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించామని తెలిపారు. అలాగే మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు (RRR), మెట్రో విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.








