ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, విద్యార్థులకు విద్యా భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వంటి కీలక అంశాల్లో ప్రజలను ప్రభుత్వం నిరాశపరిచిందని విమర్శించారు.
అదేవిధంగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ముఖ్యంగా మండల స్థాయి విలేకరులకు తగిన గుర్తింపు, అక్రెడిటేషన్లు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని కేటీఆర్ అన్నారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వానికే ప్రజలు మద్దతు ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.








‘డ్రంక్ అండ్ డ్రైవ్’.. పోలీసులకు టీడీపీ ఎంపీ వింత ప్రపోజల్ (Video)