గంగమ్మ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

గంగమ్మ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపిన దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ ఉదంతంపై దాఖలైన పిల్ పై బుధవారం ఏపీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ ఉదంతానికి సంబంధించిన చట్టపరమైన, వైద్యపరమైన నివేదికలను పరిశీలించిన గౌరవ ధర్మాసనం, కేసు తీవ్రతను బట్టి పలు కీలక ఆదేశాలను జారీ చేసింది.

విచారణ ప్రారంభంలో, ఈ కేసుతో ముడిపడి ఉన్న దుర్గప్ప చికిత్సకు సంబంధించిన అన్ని రకాల వైద్య నివేదికలను ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించారు. ఆ నివేదికలు మొత్తాన్ని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. కాగా, “మృతురాలి కుమార్తెను భయపెడుతున్నారు” అని బాధిత కుటుంబం తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

గంగమ్మ కుమార్తె లక్ష్మిని పోలీసులు తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఆమె ఉన్న స్వగ్రామంలోకి బయటి వ్యక్తులు ఎవరినీ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గంగమ్మ మరణం వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు రావాలంటే ఆమె మృతదేహానికి తిరిగి ‘రీ-పోస్టుమార్టం’ నిర్వహించాలని కోర్టును అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదిని పలు ప్రశ్నలు అడిగింది. గంగమ్మ అసలు ఎలా చనిపోయింది? పోస్టుమార్టం నివేదికలో మరణానికి గల కారణం ఏం రాసి ఉంది? ఆమె ఒంటిపై ఏవైనా గాయాలు ఉన్నాయా? అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) తో పాటు మరికొన్ని ఆరోగ్యపరమైన కారణాల వల్ల గంగమ్మ చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారని కోర్టుకు వివరించారు.

హైకోర్టు కీలక ఆదేశాలు..
ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గంగమ్మ కుమార్తె లక్ష్మికి తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది. అంతేకాకుండా, ఈ లాకప్ డెత్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి విచారణ వివరాలు, దర్యాప్తు ప్రగతిని తదుపరి విచారణ సమయానికి తమ ముందు ఉంచాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment