దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో ఏ క్షణమైనా భారీ మార్పులు, చేర్పులు జరగవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం, ప్రెసిడెంట్ ముర్ము దానిని ఆమోదించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ అంతర్గత సమీకరణాల నేపథ్యంలో దాదాపు 38 మంది మంత్రుల వరకు మార్పులు ఉండవచ్చని ఢిల్లీ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నవారున్నట్లుగా చర్చ జరుగుతోంది.
ఈసారి జరగబోయే విస్తరణ కేవలం రాజకీయ సర్దుబాటు మాత్రమే కాదని, ఇది ఒక ‘మిడ్-టర్మ్ రీసెట్’ (Mid-Term Reset) అని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచని పలువురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉంది. ప్రస్తుత సమాజంలోని ‘జెన్ జీ’ (Gen Z) ధోరణులకు, ఆలోచనలకు అనుగుణంగా క్యాబినెట్లో యువ ఎంపీలకు పెద్దపీట వేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా వంటి రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు ఈ విడతలో ప్రాధాన్యత దక్కేలా కసరత్తు సాగుతోంది.
కొత్త ముఖాలకు గ్రీన్ సిగ్నల్?
ఇతర పార్టీల నుంచి ఎన్డీయే గూటికి చేరిన కీలక నేతలకు కూడా ఈ విస్తరణలో పదవులు దక్కే ఛాన్స్ ఉందని టాక్. ముఖ్యంగా ఆప్ నుంచి బీజేపీ వైపు మొగ్గు చూపిన రాఘవ చద్దా గ్రూప్, టీఎంసీ నుంచి మారిన ఎంపీలు, అలాగే ఉద్ధవ్ థాకరే శివసేన నుంచి వచ్చిన ఆరుగురు ఎంపీలలో కొందరి పేర్లు మంత్రివర్గ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మహారాష్ట్రకు చెందిన శ్రీకాంత్ షిండే, బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి రేసులో..
ఈ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన సమీకరణాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. రెండు రాష్ట్రాల నుంచి పలువురు కీలక నేతల పేర్లు ఢిల్లీ స్థాయిలో పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని కొందరు కేంద్రమంత్రులను పదవి నుంచి తప్పించేందుకు అంతర్గత కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
గతంలో మోడీ 2.0 క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఏకంగా 12 మంది మంత్రులను తొలగించి, 30 మంది కొత్తవారికి అవకాశం కల్పించిన దాఖలాలు ఉన్నాయి. ఈసారి కూడా అదే స్థాయిలో భారీ సర్జరీ జరగబోతోందా లేదా అనేది మరో కొన్ని గంటల్లో తేలిపోయే అవకాశం ఉంది.








