రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేంద్రం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్రెడ్డిలకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో వీరికి కోర్టు నుంచి బెయిల్ లభించడంతో నిన్న (శుక్రవారం) వారు ఆఫ్రికా నుంచి నేరుగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈరోజు (శనివారం) వారు బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ములకలచెరువుకు వస్తున్నట్లు సమాచారం.
2025 అక్టోబర్ 3వ తేదీన ములకలచెరువులోని నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో భారీ ఎత్తున నకిలీ మద్యం, బాటిళ్లు, లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై ములకలచెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 98/2025 కింద మొత్తం 27 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో తంబళ్లపల్లెకు చెందిన టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఏ-17గా, గిరిధర్రెడ్డిని ఏ-18గా పోలీసులు చేర్చారు.
ఈ కేసు నమోదైనప్పటి నుంచి దాదాపు 9 నెలలుగా జయచంద్రారెడ్డి, గిరిధర్రెడ్డిలు ఆఫ్రికాలో ఉంటూ వచ్చారు. అయితే అధికార కూటమి ప్రభుత్వం కావాలనే వీరిని అరెస్ట్ చేయకుండా కాపాడుకుంటూ వస్తోందని, రాజకీయ పలుకుబడితోనే వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.
తమపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ ఉన్నత న్యాయస్థానం నుంచి బెయిల్ మంజూరు కావడంతో, నిన్ననే వారు విదేశాల నుంచి బెంగళూరు ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు. అక్కడ నుంచి నేడు శనివారం ఉదయం భారీ అనుచర గణంతో రోడ్డు మార్గంలో ములకలచెరువుకు చేరుకుంటారని సమాచారం.
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడిన నకిలీ మద్యం స్కామ్ను విజయవాడ ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండే వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు అంటగట్టారని, అక్రమ కేసులో జోగి సోదరులను జైల్లో పెట్టారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు, తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇంచార్జి జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డిలకు బెయిల్ మంజూరు
— Telugu Feed (@Telugufeedsite) June 6, 2026
ఆఫ్రికా నుంచి నిన్న బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగిన జయచంద్ర రెడ్డి, గిరిధర్ రెడ్డి
నకిలీ మద్యం తయారీ కేసులో 98/2025 ములకలచెరువు ఎక్సైజ్ పోలీస్… https://t.co/Jtj2viWzcQ pic.twitter.com/5yDb1hwPAd








