‘డీఎస్సీపై తీగ లాగితే డొంక కదిలింది’ – వైసీపీ సంచలన ట్వీట్‌

‘డీఎస్సీపై తీగ లాగితే డొంక కదిలింది’ - వైసీపీ సంచలన ట్వీట్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ (DSC)-2025 ఉపాధ్యాయ నియామకాల వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తోంది. మెరిట్‌లో ఉత్తీర్ణత సాధించి, కాల్ లెటర్లు వచ్చినప్పటికీ తమకు ఉద్యోగాలు రాలేదంటూ నిన్న కొందరు అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్థులు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించగా.. తాజాగా వైసీపీ ఈ వ్యవహారంపై మరింత లోతైన ట్వీట్‌తో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడింది.

ట్వీట్‌తో షాకిచ్చిన వైసీపీ
డీఎస్సీ-2025 నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ వైసీపీ తన అధికారిక ట్విట్ట‌ర్‌ వేదికగా విమర్శనాత్మక ట్వీట్ చేసింది. ఇందులో “డీఎస్సీ నియామకాల విషయంలో తీగ లాగుతుంటే డొంక కదులుతున్నట్లుగా ఉంది” అంటూ కొన్ని షాకింగ్ గణాంకాలను, పేర్లను తెరపైకి తెచ్చింది.

డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు సాధించిన వారిలో 38 మంది సాఫ్ట్ బాల్ క్రీడాకారులే ఉన్నట్లు చూపిస్తున్నారు. అయితే దీనిపై ఆరా తీస్తే.. ఆ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కావడం గమనార్హం.

సాఫ్ట్ బాల్ తరహాలోనే మరో 39 మంది జూడో క్రీడాకారులకు ఈ నోటిఫికేషన్‌లో ఉద్యోగాలు దక్కాయి. విచిత్రం ఏంటంటే.. ఈ జూడో అసోసియేషన్‌కు విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ (మంత్రి నారా లోకేష్ తోడల్లుడు) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండానే నేరుగా స్పోర్ట్స్ కోటా కింద 421 ఉద్యోగాలు ఇస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో జారీ చేశారంటూ వైసీపీ ఆరోపించింది.

కుట్ర కోణం ఉందా..? ఆలోచనలో పడ్డ మేధావులు
ప్రభుత్వ అధికారిక నియామకాల్లో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, మంత్రి లోకేష్ తోడల్లుడు ఎంపీ శ్రీభరత్ లీడ్ చేస్తున్న అసోసియేషన్ల అభ్యర్థులకే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు దక్కడం వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. మెరిట్ సాధించిన అభ్యర్థులకు అన్యాయం చేస్తూ, ఇలా తమకు అనుకూలమైన వారికి ఉద్యోగాలు కట్టబెడుతున్నారనే ఆరోపణలు రాష్ట్ర ప్రజలను, విద్యా రంగ మేధావులను సైతం ఆలోచనల్లో పడేసాయి.

ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది?
కాల్ లెటర్లు వచ్చి కూడా రోడ్డున పడ్డామంటున్న డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన.. దానికి తోడు స్పోర్ట్స్ కోటాపై వైసీపీ బయటపెట్టిన ఈ లీకులు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన వివాదంపై అటు కూటమి ప్రభుత్వం కానీ, ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు కానీ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment