జగన్ వ‌ద్ద‌ క్యూ కడుతున్న ‘కూటమి’ బాధితులు

జగన్ వ‌ద్ద‌ క్యూ కడుతున్న 'కూటమి' బాధితులు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశ్రయిస్తున్నారు. ఇటీవల సుగాలి ప్రీతి తల్లి, ఆ తర్వాత అమరావతి రైతులు వైఎస్ జగన్‌ను కలవగా.. తాజాగా నేడు డీఎస్సీ అభ్యర్థులు తాడేపల్లిలోని మాజీ సీఎం కార్యాలయం తలుపు తట్టారు. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలు, ఉల్లంఘనలను వివరిస్తూ అభ్యర్థులు వైఎస్ జగన్ ఎదుట కన్నీరు పెట్టుకున్నారు.

నియామకాల్లో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగామని, అయినా తమ బాధలను ఎవరూ పట్టించుకోలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పోస్టుకు ఒకరినే (1:1 పద్ధతిలో) పిలిచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత కూడా తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని అభ్యర్థులు ఆరోపించారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తమ పేర్లు సెలెక్టెడ్ జాబితాలోనూ, అటు రిజెక్టెడ్ జాబితాలోనూ లేకుండా మాయం చేశారని అభ్యర్థులు పేర్కొన్నారు. ఈ లోపాలను ప్రశ్నిస్తే విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తూ, ఆఫీసుల నుంచి వెళ్లగొట్టారని మండిపడ్డారు. మెరిట్ జాబితాలను వారం రోజుల్లోనే మార్చేస్తూ, కటాఫ్ మార్కులు కూడా ప్రకటించకుండా జిల్లాల వారీగా లిస్టులు పెట్టకుండా గోప్యత పాటించారని అభ్యర్థులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నేషనల్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించినా తనకు పోస్టు రాలేదని పోలవరానికి చెందిన దుర్గయ్య అనే అభ్యర్థి వాపోయారు. తన విషయంలో ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని, అన్ని అర్హతలు ఉన్నా పోస్టు ఇవ్వకుండా మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారని ఏకాంబరం అనే అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు.

“పేకాట లాంటి ఆటల సర్టిఫికెట్లు ఉన్నవారికి స్పోర్ట్స్ కోటా కింద పోస్టులు ఇస్తే వారు సబ్జెక్టులు ఎలా బోధించగలరు? ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ పాఠశాలలు నాశనం కావా?” అని ప్రశ్నించారు. తమ బాధలను మీడియాకు చెప్తే టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నాయని, పేదవాళ్లమైన తాము కోర్టుల చుట్టూ తిరగలేమని కన్నీరు పెట్టుకున్నారు.

అభ్య‌ర్థుల‌కు జ‌గ‌న్ హామీ
న్యాయాన్ని ఆలస్యం చేయగలరు కానీ, నిరాకరించలేరు. అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్న అభ్యర్థులందరికీ వైసీపీ లీగల్ వింగ్ ద్వారా పూర్తి న్యాయసహాయం అందిస్తాం. కోర్టు పోరాటాలకు అయ్యే ఖర్చులన్నీ మా పార్టీయే భరిస్తుందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు హామీ ఇచ్చారు. బాధితుల ఆవేదన విన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

‘మన ప్రభుత్వం వచ్చాక రీ-ఎంక్వైరీ’
ప్రస్తుత డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత కరువైందని, మొదటి ర్యాంకు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు రాలేదని వైఎస్ జగన్ విమర్శించారు. స్పోర్ట్స్ కోటా పేరిట ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు ఇచ్చేలా మొదట ఒక జీవో తెచ్చారని.. తమ వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించుకున్నాక మళ్లీ ఆ జీవోను మార్చేశారని జగన్ ఆరోపించారు. ఎవరికి మేలు చేయడానికి గేట్లు తెరిచారో, పని పూర్తయ్యాక ఎందుకు ఉపసంహరించుకున్నారో సమాధానం చెప్పాలన్నారు.

డీఎస్సీ అక్రమాలపై ఇప్పటికే తాము సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేశామని జగన్ గుర్తు చేశారు. భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రత్యేక కేసులన్నింటిపై ప్రత్యేక కమిషన్ వేసి ‘రీ-ఎంక్వైరీ’ జరిపిస్తామని అభ్యర్థులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. వరుసగా బాధితులు తాడేపల్లికి క్యూ కడుతుండటం ఏపీ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య సరికొత్త రాజ‌కీయ యుద్ధానికి దారితీస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment