శ్రీ‌వారి ఆల‌యంలో ‘మహానాడు’.. టీడీపీ బరితెగింపుపై భక్తుల ఆగ్రహం (Video)

శ్రీ‌వారి ఆల‌యంలో ‘మహానాడు’.. టీడీపీ బరితెగింపుపై భక్తుల ఆగ్రహం (Video)

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)నిర్వహిస్తున్న ‘మహానాడు’(Mahanadu) వేళ అధికార పార్టీ నేతల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. పవిత్రమైన దేవాలయాలను, ప్రభుత్వ కార్యాలయాలను రాజకీయ వేదికలుగా మారుస్తూ టీడీపీ శ్రేణులు బరితెగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి (Sri Venkateswara Swamy Temple) తాళం వేసి మహానాడు నిర్వహించగా.. విశాఖపట్నంలో(Visakhapatnam) ఏకంగా గ్రామ/వార్డు సచివాలయ భవనాన్ని రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో అధికార పార్టీ నేతల ప్రవర్తనపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టీడీపీ(TDP) నేతలు పూర్తిగా రాజకీయ వేదికగా మార్చేశారు. మహానాడు నిర్వహణ కోసం ఏకంగా స్వామివారి దేవాలయానికి తాళం వేసి మరి కార్యక్రమాన్ని జరిపారు. ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేశారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలోనే భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి, దానిపై మహానాడు ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించారు.

శ్రీవారి ఆలయ గర్భాలయ పరిసర ప్రాంతాల్లోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని (NTR Statue) ఉంచి, టీడీపీ నేతలు నివాళులర్పించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “రాజకీయ కార్యక్రమాల కోసం పవిత్రమైన దేవాలయాన్ని వాడుకుంటూ, దేవునితో చెలగాటమాడుతున్నారు” అంటూ స్థానిక భక్తులు అధికార పార్టీ నేతల తీరుపై మండిపడుతున్నారు.

సచివాలయం చుట్టూ టీడీపీ జెండాలు
ఇదిలా ఉండగా, విశాఖపట్నంలో ప్రభుత్వ భవనాలను రాజకీయాలకు వాడుకుంటున్న తీరుపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. విశాఖ నగరం 46వ వార్డు కైలాసపురం పరిధిలోని ప్రభుత్వ సచివాలయ భవనాన్ని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా మార్చారు.

సచివాలయ భవనం చుట్టూ భారీగా టీడీపీ జెండాలు, మహానాడు బ్యానర్లను ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా, సచివాలయ భవన మొదటి అంతస్తులోనే మహానాడు వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాన్ని పార్టీ ఆఫీసుగా మార్చడంపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సచివాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment