ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబంపై వైరిపక్షం చేస్తున్న ప్రచారం తారాస్థాయికి చేరింది. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై అధికార తెలుగుదేశం పార్టీ నుంచి డజన్ల కొద్దీ ప్రెస్మీట్లు పెడుతూ అనేక నిందారోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీరుపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ కుటుంబాన్ని, వారి వంశాన్ని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలపై ఆమె మౌనంగా ఉండటాన్ని తప్పుపట్టారు.
వైఎస్ కుటుంబంపై ఫ్యాక్షనిస్టు ముద్ర వేసేందుకు తెలుగుదేశం పార్టీ (TDP) శతవిధాలా ప్రయత్నిస్తోందని, దీనిపై వైఎస్ షర్మిల ఎందుకు స్పందించడం లేదని రాచమల్లు ప్రశ్నించారు. “కుటుంబంపై ఫ్యాక్షనిస్టు ముద్ర వేస్తుంటే.. నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా షర్మిలమ్మ? మీ వంశం గురించి ప్రత్యర్థులు విమర్శిస్తుంటే మీరెందుకు నోరు మెదపడం లేదు? మీ తాత (రాజారెడ్డి), మీ తండ్రి (వైఎస్సార్), మీ సోదరుడు (వైఎస్ జగన్)లను భ్రష్టు పట్టించేలా ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?” అని రాచమల్లు నిలదీశారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయని తప్పులను కూడా ఆయనకు ఆపాదిస్తూ, వైసీపీని ‘గొడ్డలి పార్టీ’ అని పదే పదే టీడీపీ విమర్శించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని రాచమల్లు మండిపడ్డారు. వైఎస్ జగన్ కక్షసాధింపు రాజకీయాలకు, హత్య రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారని, వైఎస్ జగన్ మంచితనం వల్లే నాటి వైఎస్ రాజారెడ్డిని చంపిన వారు కూడా ఈరోజు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. జగన్ ఫ్యాక్షనిజం చేయాలనుకుంటే వారు అలా తిరగగలరా? అని ప్రశ్నించారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుచేస్తూ ఆయన ఒక గొప్ప మానవతావాది అని రాచమల్లు గుర్తుచేశారు. పేదల కోసం ఆరోగ్యశ్రీ, 108, 104 ఉచిత అంబులెన్స్ సేవలు, రైతుల కోసం జలయజ్ఞం, ఉచిత విద్యుత్, విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ వంటి విప్లవాత్మక పథకాలను సృష్టించిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్ అని చెప్పారు.
“వైఎస్ వివేకాను చంపింది తానేనని అప్రూవర్గా మారిన దస్తగిరి స్వయంగా ఒప్పుకుంటున్నాడు. అలాంటి పేదవాడైన దస్తగిరి తరఫున చంద్రబాబు నాయుడు కేసులను వాదించే ప్రముఖ లాయర్ లూత్రానే కోర్టులో వాదిస్తున్నారు. దీని వెనుక ఉన్న లింకు ఏంటో ప్రజలందరికీ అర్థమవుతోంది” అని శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.








