దేశవ్యాప్తంగా ఖాళీ కానున్న రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఎన్నికల షెడ్యూల్ (Elections Schedule) విడుదల చేసింది. జూన్–జూలై నెలల్లో పదవీకాలం ముగియనున్న సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మొత్తం 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఈ షెడ్యూల్ వర్తించనుంది. ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా, వాటి భర్తీ కోసం కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 1న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుండగా, జూన్ 18న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వానీ, సాన సతీష్ బాబు పదవీకాలం ముగియనుంది. ఇదే సమయంలో కర్ణాటక నుంచి ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ పదవీకాలం కూడా పూర్తవుతోంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) నుంచి దిగ్విజయ్ సింగ్ పదవీకాలం ముగియనుండగా, గుజరాత్లో (Gujarat) నాలుగు, కర్ణాటకలో (Karnataka) నాలుగు, జార్ఖండ్లో (Jharkhand) రెండు, మధ్యప్రదేశ్లో మూడు, మణిపూర్లో (Manipur) ఒక స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.







