జస్ప్రీత్ బుమ్రా కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వడం ప్రస్తుతం భారత క్రికెట్లో హాట్ టాపిక్గా మారింది. ఆఫ్ఘనిస్థాన్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్తో పాటు మూడు వన్డేల సిరీస్కు కూడా బుమ్రాను ఎంపిక చేయకపోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇంగ్లండ్ టూర్కు బుమ్రా తిరిగి జట్టులో చేరతాడని స్పష్టం చేశాడు. మరోవైపు సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా టెస్టుకు విశ్రాంతి ఇవ్వగా.. టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి రిషభ్ పంత్ను తప్పించి, ఆ బాధ్యతలను కేఎల్ రాహుల్కు అప్పగించడం చర్చనీయాంశమైంది.
ఇక ఈ సిరీస్ల కోసం ప్రకటించిన జట్లలో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయడం విశేషం. దేశీయ క్రికెట్లో మెరిసిన మనవ్ సుతార్, గుర్నూర్ బ్రార్లకు టెస్టు జట్టులో తొలి అవకాశం దక్కగా.. వన్డే జట్టులో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ ఎంపికయ్యాడు. టెస్టు జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా కొనసాగుతుండగా.. వన్డేల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు కొనసాగుతున్నారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తూ, సీనియర్ ప్లేయర్ల వర్క్లోడ్ను సమతుల్యం చేసే దిశగా బీసీసీఐ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.








