దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ్ కేసు వ్యవహారంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుతో ముడిపెడుతూ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో తన పేరును ఉపయోగించకుండా నిలువరించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఈ మేరకు ‘గ్యాగ్ ఆర్డర్’ (Gag Order) జారీ చేసింది.
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ, కేవలం రాజకీయ కారణాలతో తన పేరును లాగుతూ మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కోర్టును ఆశ్రయించారు. ఈ తప్పుడు ప్రచారం వల్ల తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని, కావున ఈ వ్యవహారంలో తన పేరు వాడకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్లో కోరారు. మంత్రి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను విచారించిన సివిల్ కోర్టు, ప్రాథమిక వాదనల అనంతరం కీలక ఆదేశాలను జారీ చేసింది.
బండి భగీరథ్ కేసు విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పేరును ఎక్కడా, ఎలాంటి వార్తల్లోనూ ఉపయోగించరాదని సిటీ సివిల్ కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు మీడియాలో బండి సంజయ్ పేరును ప్రస్తావిస్తూ వచ్చిన ఈ కేసుకు సంబంధించిన కథనాలను, డిజిటల్ వార్తలను తక్షణమే డిలీట్ చేయాలని ఆదేశించింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియోలను సైతం తొలగించాలని (Delete) కోర్టు పేర్కొంది.








