భారతీయులకు (Indians) బంగారంపై Gold) ఉన్న మక్కువ ప్రపంచంలో మరెవరికీ లేదు. దేశంలోని ప్రతి ఇంటా సెంటిమెంట్గా దాచుకున్న బంగారం విలువ కొన్ని లక్షల కోట్లు. భారతీయుల ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు ‘గోల్డ్ మానిటైజేషన్’ (Gold Monetization) పాలసీని మరింత సరళతరం చేస్తూ కొత్త నిబంధనలను తీసుకురాబోతోంది. ఆ నిధులనే దేశాభివృద్ధికి వనరుగా మార్చాలని ప్రధాని మోడీ (Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.
సామాన్యులకు ‘గోల్డ్’ ఆఫర్!
కొత్త పాలసీ ప్రకారం, మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో(Banks) డిపాజిట్ (Deposit) చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నారు. గతంలో ఉన్న నిబంధనలను సడలించి, కేవలం 10 గ్రాముల బంగారం ఉన్నా సరే బ్యాంకులో డిపాజిట్ చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. డిపాజిట్ చేసిన బంగారంపై నిర్ణీత వడ్డీ లభిస్తుంది. అంతేకాకుండా, దీని ద్వారా వచ్చే ఆదాయంపై (Income) పన్ను మినహాయింపులు (Tax Exemptions) కూడా ఉండేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.
30,000 టన్నుల బంగారం.. లక్ష్యం ఇదే!
కేంద్ర అంచనాల ప్రకారం, భారతీయుల వద్ద దాదాపు 30,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇందులో కనీసం 2,000 టన్నుల బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురాగలిగితే, రాబోయే మూడేళ్ల వరకు భారత్(India)బయటి దేశాల నుండి బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. బంగారం దిగుమతులు తగ్గితే, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి విలువ గణనీయంగా పెరుగుతుంది.
బ్యాంకుల్లో డిపాజిట్ అయిన బంగారాన్ని జ్యువెలర్లకు నేరుగా సరఫరా చేస్తారు. దీనివల్ల దేశీయంగా నగల తయారీ రంగం అభివృద్ధి చెందుతుంది. విదేశీయులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడమే ఈ ‘మాస్టర్ ప్లాన్’ ప్రధాన ఉద్దేశం. త్వరలోనే ఆర్థిక శాఖ ఈ కొత్త గోల్డ్ పాలసీని అధికారికంగా ప్రకటించనుంది. దీనికి భారీ స్పందన వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.








