ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ఉద్ధండుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి తన గళం వినిపించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ‘ప్రజా ఆశీర్వాద సభ’పై ఆయన ప్రశంసలు కురిపిస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. నేటి సభ నాటి చారిత్రాత్మక ‘జైత్రయాత్ర’ను తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాజకీయ భవిష్యత్తుపై కొంతకాలం మనస్థాపానికి గురయ్యానని జీవన్ రెడ్డి బాహాటంగానే అంగీకరించారు. “రాజకీయంగా విభేదించినా, కేసీఆర్ నన్ను అక్కున చేర్చుకున్నారు. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని పేర్కొంటూ తన కొత్త రాజకీయ ప్రయాణంపై స్పష్టతనిచ్చారు. తెలంగాణ రైతాంగానికి మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
“గతంలో తుమ్మిడిహట్టి కట్టాలని నేను డిమాండ్ చేసింది వాస్తవమే, కానీ కాళేశ్వరం ద్వారానే భారీ సంఖ్యలో రైతులకు మేలు జరుగుతుంది. మళ్లీ తుమ్మిడిహట్టి నిర్మాణం కావాలన్నా అది కేసీఆర్ తోనే సాధ్యం.”మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ (NDSA) నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. ” ఏడాది కాలంగా గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా? ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఏం చేస్తారు? పునరుద్ధరణ పనులు ఎప్పుడు పూర్తవుతాయి?” అంటూ ధ్వజమెత్తారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని జీవన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా నేటి సభ సాగబోతోందని, ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్న జీవన్ రెడ్డి, ఇప్పుడు బీఆర్ఎస్ గూటికి చేరి ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించడం జగిత్యాల రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.








