21 శతాబ్దపు ఆధునిక మహిళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచే అవతరించాలన్న జగన్ (Jagan) నినాదం కేంద్రానికే (Central Government) దిక్సూచిగా మారిందా..? నేటి మహిళా బిల్లుకు (Women’s Bill) మునుపే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో (YSRCP Rule) జరిగిన మహిళా ఆర్థిక స్వావలంబన, అనుసరించిన 50 శాతం రిజర్వేషన్ల (50 Percent Reservations) నిబంధన కేంద్రానికి ప్రేరణగా నిలిచిందా..? అంటే అవునంటున్నాయి వైసీపీ వర్గాలు.
దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మహిళా సాధికారతకు జరిగిన కృషి మరోసారి వెలుగులోకి వచ్చింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని వైసీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. మెజార్టీ పథకాలు మహిళల పేరు మీదనే అందించి వారి ఆర్థిక స్వావలంబనకు వైఎస్ జగన్ బాటలు వేశారని గుర్తుచేస్తున్నారు.
అక్షరాలా రూ. 1.89 లక్షల కోట్లు
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. పవర్లోకి వచ్చిన తొలినాళ్ల నుంచే ఆ పార్టీ నవరత్నాల హామీల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. 2019 నుండి 2024 వరకు జగన్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా కేవలం మహిళల ఖాతాల్లోకే నేరుగా రూ. 1,89,519.08 కోట్లను జమ చేసింది. డిబిటి (Direct Benefit Transfer) ద్వారా ఇంత భారీ మొత్తంలో మహిళా సాధికారత కోసం వెచ్చించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచింది.
నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు
చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లకు వైసీపీ బేషరతు మద్దతు ప్రకటించడమే కాకుండా, ఇప్పటికే రాష్ట్రంలో ఆచరణలో చూపిస్తోంది. వైసీపీ టెన్యూర్లో నామినేటెడ్ పనులు, పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకువచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని ఆ పార్టీ శ్రేణులు మహిళా బిల్లు సందర్భంగా గుర్తుచేస్తుండడం గమనార్హం.
దళిత మహిళను హోంమంత్రిగా, మహిళకు ఉపముఖ్యమంత్రి పదవిని అందించి సామాజిక విప్లవాన్ని సృష్టించారు. జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్ల పదవుల్లో 50 శాతానికి పైగా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. మహిళల ఆర్థిక స్థితిగతులను మార్చడానికి జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపాయని గుర్తుచేస్తున్నారు.
పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసి తల్లులకు అండగా నిలిచారు. ఐదేళ్ల కాలంలో అమ్మ ఒడి ద్వారా 44,48,865 మంది లబ్ధిదారులకు రూ.26,067 కోట్లు అందించారు. 45-60 ఏళ్ల మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26,98,931 మందికి రూ.19,189.59 కోట్లు అందించారు. ఈ ఆర్థిక సాయం ద్వారా స్వయం సమృద్ధిని కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మంది మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి, వారిని ఇంటి యజమానులుగా మార్చారు. సున్నావడ్డీ పథకం ద్వారా 1,05,13,365 మంది లబ్ధిదారులకు రూ.4,969.04 కోట్లు అందించారని వైసీపీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి.
రక్షణ కోసం ‘దిశ’
మహిళల భద్రత కోసం దిశ యాప్ను ప్రవేశపెట్టి, ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. మహిళా పోలీసు వ్యవస్థను ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో వారికి రక్షణ కవచంగా నిలిచారు. పార్లమెంట్లో మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీలు గళం వినిపిస్తూ.. మహిళల పట్ల జగన్ చూపిస్తున్న పక్షపాతమే నేడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్టీ బేషరతు మద్దతు తెలపడానికి కారణమని వెల్లడించారు. మహిళా సాధికారత విషయంలో వైసీపీది ‘నిబద్ధత’ అయితే, ప్రత్యర్థి పార్టీలది ‘కపట నాటకం’ అని వారు విమర్శిస్తున్నారు.








