“నారీ శక్తి” దేశ అభివృద్ధికి శక్తి – ప్రధాని మోడీ కీలక సందేశం

“నారీ శక్తి” దేశ అభివృద్ధికి శక్తి - ప్రధాని మోడీ కీలక సందేశం

“వికసిత్ భారత్” (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్య సాధనలో మహిళలు కీలక పాత్ర పోషించాలని, దేశ అభివృద్ధికి ‘నారీ శక్తి’యే ప్రధాన చోదక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ఢిల్లీ వేదికగా సోమవారం ఆయన మాట్లాడుతూ, మహిళల సాధికారత, రాజకీయ భాగస్వామ్యం, భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు
మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రధాని తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రత్యేక చర్చ జరగనుంది. చట్టం 2023లో ఏకగ్రీవంగా ఆమోదించబడిన నారీ శక్తి వందన్ చట్టాన్ని, విపక్షాల కోరిక మేరకు 2029 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రపతి భవన్ వరకు..
దేశ నిర్మాణంలో మహిళల పాత్రను ప్రధాని కొనియాడారు. ప్రస్తుతం దేశ రాష్ట్రపతి నుంచి ఆర్థిక మంత్రి వరకు కీలక పదవుల్లో మహిళలు రాణిస్తున్నారు. స్థానిక సంస్థల్లో 14 లక్షలకు పైగా మహిళలు పనిచేస్తుండగా, 21 రాష్ట్రాల్లో పంచాయతీల్లో 50% మహిళా భాగస్వామ్యం ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మోడీ గుర్తుచేశారు.

విద్య, సాంకేతిక, రక్షణ రంగం
STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) విద్యలో భారత్‌లో మహిళల భాగస్వామ్యం 43% కి చేరిందని ప్రధాని తెలిపారు. ఫైటర్ పైలట్లుగా, డ్రోన్ దీదీలుగా మహిళలు సరిహద్దులను చెరిపివేస్తున్నారు. NDA, సైనిక్ స్కూల్స్‌లో బాలికలకు ప్రవేశాలు కల్పించడం ద్వారా రక్షణ రంగంలో కొత్త తలుపులు తెరుచుకున్నాయి. మహిళల భద్రత కోసం కఠిన చట్టాలతో పాటు సాంకేతికతను జోడించినట్లు ప్రధాని వివరించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ఈ-ఎఫ్‌ఐఆర్ (e-FIR), జీరో ఎఫ్‌ఐఆర్ వంటి సౌకర్యాలు మహిళలకు రక్షణ కవచంలా మారాయి.

నారీ శక్తి చర్చ గ్రామస్థాయికి చేరాలి
మహిళలు తమ అభిప్రాయాలను నేరుగా ఎంపీలకు తెలియజేయాలని, నారీ శక్తిపై జరుగుతున్న ఈ చర్చను గ్రామాల వరకు తీసుకెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. నిర్ణయ ప్రక్రియలో మహిళల పూర్తి భాగస్వామ్యం ఉన్నప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆయన ముగించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment