పాముకాటుకు విద్యార్థిని బ‌లి.. ప్ర‌భుత్వ హాస్ట‌ల్స్‌లో ఏంటీ నిర్ల‌క్ష్యం..?

పాముకాటుకు విద్యార్థిని బ‌లి.. ప్ర‌భుత్వ హాస్ట‌ల్స్‌లో ఏంటీ నిర్ల‌క్ష్యం..?

అనకాపల్లి జిల్లా (Anakapalli District) అచ్యుతాపురంలో (Achyutapuram) చోటుచేసుకున్న విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్ల (Government Hostels) దుస్థితిపై చర్చకు దారితీసింది. అధికారుల నిర్లక్ష్యం ఒక నిరుపేద విద్యార్థిని ప్రాణాలను బలిగొనడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల భద్రత గాలికి వదిలేశారన్న ఆరోపణలకు అచ్యుతాపురం ఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. అచ్యుతాపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) హాస్టల్‌లో పాముకాటుకు (Snake Bite) గురై నవ్య అనే ఏడో తరగతి (7th Class) విద్యార్థిని మృతి చెందడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.

వివ‌రాల్లోకి వెళితే..
హాస్టల్‌లో విద్యార్థిని నవ్యకు (Navya) పాము కాటేసింది. గమనించిన హాస్టల్ సిబ్బంది, తల్లిదండ్రులు ఆమెను అపస్మారక స్థితిలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆమెను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి (NTR Hospital, Anakapalli) రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి నవ్య ప్రాణాలు విడిచింది. నవ్య మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ దూరమైందని హాస్టల్ ఎదుట‌ ఆందోళనకు దిగారు.

ముందే హెచ్చరించినా ..
హాస్టల్ పరిసరాల్లో పాముల బెడద ఎక్కువగా ఉందని, ఈ విషయంపై పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వమే నవ్య ప్రాణాలు తీసిందని వారు ఆరోపిస్తున్నారు.

సమస్యల నిలయాలుగా ప్రభుత్వ హాస్టళ్లు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు (Government Schools), హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస ఘటనలు దీనికి అద్దం పడుతున్నాయి:

భోజనంలో బొద్దింకలు: హోంమంత్రి (Home Minister) స్వయంగా తనిఖీ చేసిన సమయంలోనూ భోజనంలో బొద్దింకలు రావడం.
ముక్కు మూసుకున్న ఎమ్మెల్యే: కడపలో ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్ల (Toilets) దుస్థితిని చూసి ముక్కు మూసుకుని బయటకు రావడం.
ఈగల భోజనం: గుడివాడలో పిల్లలతో భోజనం చేస్తూ “రోజూ ఎన్ని ఈగలు (Flies) తింటారు?” అని టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం.
కలుషిత నీరు: పార్వతీపురం మన్యం జిల్లాలో కలుషిత నీరు తాగి విద్యార్థులు మరణించిన ఉదంతం ఇంకా మ‌రిచిపోనే లేదు.

విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు?
రాష్ట్ర విద్యాశాఖ బాధ్యతలు స్వయంగా ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ (Lokesh) చూస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో విద్యా వ్యవస్థపై నిర్ల‌క్ష్య వైఖ‌రి కొన‌సాగుతుండ‌డంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద విద్యార్థులు చదివే హాస్టల్స్ మౌలిక సదుపాయాలు లేక, భద్రత కరువై మృత్యుకూపాలుగా మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వరుస మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం ఇంకా మొద్దునిద్రలోనే ఉందా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment