ప్రభుత్వం ఇరుకునపడిన ప్రతీసారి, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దూషణలతో ముంచెత్తడడం టీడీపీలో అంతర్గత చర్చకు దారి తీస్తుంది. తాజాగా, మావిగన్ పేరుతో జగన్ చేసిన ప్రతిపాదన తమకు రాజకీయంగా సమస్యలను తెచ్చిపెట్టిందని, టీడీపీలో తీవ్ర చర్చకు దారి తీసింది. జగన్ మావిగన్ ప్రతిపాదనను ఎదుర్కొనే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా, ఆయన కుమారుడు లోకేష్ అనుసరించిన వ్యూహాలపై పార్టీలో విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి, వివేకా హత్య కేసు, షర్మిలతో కుటుంబ విభేదాలు.. ఈ మూడు అంశాలు నిరంతరం ప్రస్తావించడం ద్వారా జగన్పై వ్యక్తిత్వ హననం కొనసాగించి, మావిగన్ సహా ప్రజా సంబంధిత సమస్యలు, అంశాల నుంచి పక్కదోవ పట్టించాలని పదేపదే ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ నాయకత్వానికి, శ్రేణులకు టెలీ కాన్ఫరెన్స్ల ద్వారా అనేక సమావేశాల్లోనూ చెబుతున్నారు.
దీంట్లో భాగంగానే, గడిచిన రెండు మూడు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నిమ్మల, సవిత, టీడీపీ నేతలు పట్టాభి వంటి తదితరులంతా ఒక్కపెట్టున విరుచుకుపడ్డారు. పనిలో పనిగా, షర్మిలనూ రంగంలోకి దించారన్న విమర్శలు వినిపించాయి. జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టడానికి ఊహించని రీతిలో హద్దులు దాటి చెలరేగిపోవడం, పరుష పదాలతో మాట్లాడడం ప్రజలనే కాదు, టీడీపీలో కొందరు నాయకులను కూడా నివ్వెరపోయేలా చేసింది.

జగన్పై ఇలాంటి దాడి ఇప్పుడే మొదలైంది కాదు. 2009లో వైఎస్సార్ మరణం తరువాత నుంచి జగన్ వ్యక్తిత్వంపై విపరీతమైన దాడులు కొనసాగుతున్నాయనేది బహిరంగ రహస్యం. 2004, 2009లో వరుస ఓటముల తరువాత తమకు వ్యతిరేకంగా మరో బలమైన నాయకుడు ఉండకూడదు అనేది ఆ పార్టీ బలమైన ఆశయంగా పెట్టుకుందని ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన నేతలే అనేక ఇంటర్వ్యూలలో చెప్పడం అందరూ విన్నదే. పాత చింతకాయ పచ్చడిలా 2009 నుంచి ఇప్పటి వరకు జగన్ వ్యక్తిత్వంపై దాడి చేయడం వల్ల ఆయనకు సింపతీ తప్ప టీడీపీకి ఒరిగేదీ ఏమీ ఉండదని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
రాజధాని అంశంపై జగన్ మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. దాన్ని డైవర్ట్ చేయడానికి అనుకూల మీడియాను వాడుకొని మరింతగా ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నామని మెజార్టీ టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మావిగన్ అంశాన్ని తెరమరుగు చేద్దామని వైసీపీ శ్రేణుల కుటుంబాలపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా, అది వారికే సింపతీ తెచ్చిపెట్టిందని, ఆడవారిని అసభ్యకరంగా మాట్లాడి అపకీర్తిని మూటగట్టుకున్నామని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

మావిగన్ ప్రతిపాదనను ససేమిరా అంటున్న చంద్రబాబు.. రాజధానే అమరావతిగా ఎందుకనే వివరణ ఇవ్వకలేకపోతున్నారు. అమరావతిలో అవినీతి లేదని, పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని టెండర్ డాక్యుమెంట్లు ఎందుకు టీడీపీ ప్రభుత్వం బయటపెట్టలేకపోతుందని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అలా చేయకపోవడం వల్ల అమరావతి అవినీతి జరుగుతుందన్న వైసీపీ ఆరోపణలకు పరోక్షంగా అంగీకరించినట్టు అవుతుందని టీడీపీలో చర్చ. హేతుబద్ధమైన సమాధానాలు చెప్పకుండా జగన్ వ్యక్తిత్వంపై దాడి చేసినా కొద్దీ.. అమరావతిలో టీడీపీ చేస్తున్న అవినీతిపై వైసీపీ బలంగా వెళ్తుందని, ఇలాంటి విధానాలు ఎంతకాలం పనిచేయవని అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. మావిగన్పై చంద్రబాబు ముందుచూపు లేకుండా చేస్తున్న ఎదురుదాడులన్నీ జగన్కు సింపతీని తెచ్చిపెడుతున్నాయని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.







