ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మళ్లీ హీటెక్కింది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) కాన్సెప్ట్పై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. భారీ ఖర్చుతో కూడిన అమరావతి కంటే, ఇప్పటికే మౌలిక సదుపాయాలున్న ఈ మూడు నగరాలను అనుసంధానిస్తూ రాజధానిని అభివృద్ధి చేయడం ఉత్తమమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎందుకు మేలు అనేందుకు కారణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
ఖర్చు లెక్కలు
జగన్ మావిగన్ ప్రతిపాదన అనంతరం అమరావతి నిర్మాణ వ్యయంపై వస్తున్న లెక్కలు సామాన్యుడిని విస్మయానికి గురిచేస్తున్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు. చంద్రబాబు ప్రభుత్వం లెక్కల ప్రకారమే, 50 వేల ఎకరాల్లో కేవలం రోడ్లు, డ్రైనేజీ, కరెంటు కోసం ఎకరానికి రూ. 2 కోట్లు ఖర్చవుతుంది. అంటే మొత్తం రూ. 1 లక్ష కోట్లు. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు సేకరిస్తే ఆ ఖర్చు రూ. 2 లక్షల కోట్లకు చేరుతుంది. కేవలం రోడ్లకే ఇంత ఖర్చయితే, భవనాలు, ఐకానిక్ స్ట్రక్చర్స్ పూర్తి కావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఆ సమయానికి అంచనా వ్యయం రూ. 10 లక్షల కోట్లకు పెరిగినా ఆశ్చర్యం లేదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

‘మావిగన్’ – ఎందుకింత ఆదరణ?
మావిగన్ అనేది కేవలం ప్రతిపాదన కాదు, అది ఇప్పటికే ఉన్న వనరుల సమూహం అని నిపుణులు చెబుతున్నారు. మచిలీపట్నం పోర్టు, గన్నవరం విమానాశ్రయం, విజయవాడ-గుంటూరుల మధ్య ఉన్న హైవేలు, రైల్వే జంక్షన్లు ఈ ప్రాంతానికి పెద్ద ప్లస్. అమరావతిలో ఖర్చు చేసే దాంట్లో కేవలం 10 శాతం (సుమారు రూ. 20 వేల కోట్లు) కేటాయిస్తే మావిగన్ను ప్రపంచ స్థాయి మహానగరంగా మార్చవచ్చని నెటిజన్ల లెక్క. శూన్యం నుంచి నగరాన్ని సృష్టించడం కంటే, ఇప్పటికే వ్యాపార, వాణిజ్య కేంద్రాలుగా ఉన్న నగరాలను కలిపి అభివృద్ధి చేయడం వల్ల త్వరగా ఆదాయం వస్తుంది.

కూటమిలో అలజడి.. డైవర్షన్ పాలిటిక్స్?
మావిగన్ ప్రతిపాదనకు వస్తున్న మద్దతు చూసి చంద్రబాబు ప్రభుత్వం డిఫెన్స్లో పడిందనే విశ్లేషణలు వస్తున్నాయి. అమరావతి కోసం 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్లు కావాలని గతంలో చంద్రబాబు అన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు మంత్రి లోకేష్, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు తలనొప్పిగా మారింది. ఈ చర్చను పక్కదారి పట్టించేందుకే అచ్చెన్నాయుడు వంటి నేతలతో విలేకరుల సమావేశాలు పెట్టిస్తూ, అసందర్భ ప్రేలాపనలు చేయిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
“అమరావతిలో కేవలం గ్రాఫిక్స్ తప్ప ఏముంది?” అని నెటిజన్లు నిలదీస్తున్నారు. టెండర్లలో అవినీతి, మొబిలైజేషన్ అడ్వాన్సుల వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకే ఈ ‘డైవర్షన్’ అస్త్రాలు ప్రయోగిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. పోర్టు, విమానాశ్రయం వంటి సహజ వనరులున్న మావిగన్ను కాదని, కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం అమరావతిపై లక్షల కోట్ల రూపాయలు కుమ్మరించడం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టడమేనన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది.








