దేశ భవిష్యత్తును, ప్రభుత్వ విధానాలను నిర్ణయించే అత్యంత కీలకమైన ‘జనగణన’ (సెన్సస్) ప్రక్రియకు రంగం సిద్ధమైంది. సుమారు 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2027లో జరగనున్న ఈ భారీ ఎక్ససైజ్పై సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి ప్రెస్ మీట్లో కీలక వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన ఇదే కావడం విశేషం. ఇందుకు సంబంధించిన వివరాలను సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి మీడియాకు వివరించారు.
జనగణన షెడ్యూల్ రెండు దశల్లో ప్రక్రియ చేపట్టనున్నారు. ఈసారి సెన్సస్ డిజిటల్ పద్ధతిలో జరగనుంది. దీనికి సంబంధించిన కాలానుగుణ పట్టిక ఇలా ఉంది.
మొదటి దశ (హౌసింగ్ సెన్సస్)
2026 ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు జరుగుతుంది. ఇది ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు.
గణన ప్రక్రియ 2026 మే 11 నుండి జూన్ 9 వరకు జరుగుతుంది
రెండో దశ (జనగణన)
ప్రధాన ప్రక్రియ 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు జరుగుతుంది. నిరాశ్రయుల వివరాలు 2027 ఫిబ్రవరి 28న సేకరిస్తారు. రివిజనల్ రౌండ్ 2027 మార్చి 1 నుండి మార్చి 5 వరకు నిర్వహిస్తారు.
‘సెన్సస్’ మాత్రమే ప్రామాణికం.. కుల గణనపై కీలక ప్రకటన
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో 8వ సారి జరుగుతున్న ఈ జనగణనలో తొలిసారిగా కుల గణనను చేపట్టబోతున్నారు. “జనగణన చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఇతరులు చేసేది కేవలం ‘సర్వే’ మాత్రమే అవుతుంది, కానీ సెన్సస్ కాదు” అని భారతి హోలికేరి స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారుకు ఈ డేటానే ప్రామాణికం కానుంది.
అడిగే ప్రశ్నలు – సేకరించే డేటా
మొదటి దశలో మొత్తం 33 ప్రశ్నలు అడుగుతారు. ఇంటి యజమాని, ఇంటి పరిస్థితి వివరాలు, ఇంట్లో ఉన్న వసతులు, ఆస్తుల వివరాలు, ఈసారి కొత్తగా ఆహార అలవాట్లపై వివరాలు సేకరిస్తారు. పట్టణాల్లో 420 రకాల అంశాలు, గ్రామాల్లో 400 రకాల డేటా పాయింట్లను సేకరించనున్నారు. సెక్షన్ 15 ప్రకారం ప్రజలు ఇచ్చే సమాచారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. ఈ సమాచారాన్ని కోర్టులో సాక్ష్యంగా (Evidence) ఉపయోగించే అవకాశం లేదు. సెన్సస్లో సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే 1000 రూపాయల జరిమానా విధిస్తారు.సెన్సస్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి పూర్తి రక్షణ కల్పిస్తారు.
“అన్ని సర్వేలకు సెన్సెస్ మదర్ లాంటిది. పల్లెల నుంచి పట్టణాలకు మైగ్రేషన్ ఎలా ఉంది? ఏ ప్రాంతానికి ఏ పాలసీ అవసరం? అనేది తెలియాలంటే ఇది అద్దంలా ఉండాలి. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ భారీ ప్రక్రియ సక్సెస్ అవుతుంది.” అని భారతి హోలికేరి స్పష్టం చేశారు.








