క‌డియం, దానం అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక నిర్ణయం

తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేయడంతో ఇద్దరికీ భారీ ఊరట లభించింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణయం
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 12లోపు అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేసి తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఉన్న పిటిషన్లను తిరస్కరించి వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై కూడా అనర్హత పిటిషన్లను కొట్టివేయడంతో మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు ఉపశమనం లభించినట్లైంది.

రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన అనర్హత వివాదం
తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసిన ఈ వివాదం బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో ప్రారంభమైంది. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు మొదట హైకోర్టును, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరకు కోర్టు సూచనల నేపథ్యంలో స్పీకర్ వరుసగా నిర్ణయాలు తీసుకుంటూ ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment