అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) (Telugu Desam Party)లో నేతల మధ్య వర్గపోరు మరింత ముదురుతోంది. అమరావతికి (Amaravati) కూతవేటు దూరంలో ఉండే ఇద్దరి నేతల మధ్య పంచాయితీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నారా లోకేష్ (Nara Lokesh)కు అత్యంత సన్నిహితుడి పేరున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్నీ) (Kesineni Sivanath – Chinni) – తిరువూరు దళిత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) మధ్య వివాదం రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా జరిగిన వ్యాఖ్యలతో ఈ రాజకీయ ఘర్షణ మరింత చర్చనీయాంశమైంది.
గంపలగూడెంలోని నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవ కార్యక్రమంలో పట్టువస్త్రాల సమర్పణ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని వర్గీయులు మద్యం సేవించి వచ్చి రచ్చ చేశారంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఇదే విషయంపై మరోసారి మీడియా ముందు మాట్లాడిన కొలికపూడి, కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. “ఎంపీ (MP) అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు” అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. “ఎంపీ అంటే M అంటే మట్టి, P అంటే పేకాటగా మార్చేశారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
ఇప్పటికే టీడీపీ(TDP)లో అంతర్గత విభేదాలపై చర్చ జరుగుతుండగా, ఈ తాజా ఆరోపణలు పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చే అవకాశముంది. మరోవైపు, కేశినేని చిన్ని వర్గం ఈ ఆరోపణలను ఖండించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందో, ఇరు నేతల మధ్య సయోధ్య కుదురుతుందో లేదో అన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.








