ఏపీలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ప్రతిపక్ష వైసీపీ కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైంది. విద్యుత్ చార్జీల పెంపుదల ద్వారా ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని మోపడం దుర్మార్గమని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు పాలన ప్రజలను కష్టాల్లోకి నెట్టేస్తోందన్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు.
పోస్టర్ ఆవిష్కరణ
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి తదితరులు పాల్గొని కరెంటు చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాటు పోస్టర్ను ఆవిష్కరించారు.
మాజీ మంత్రి జోగి రమేష్ మాటల్లో..
“ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలపై భారీ భారాన్ని మోపుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారంను ప్రజలపై మోపుతున్నాడు. గతంలోనూ విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను అనేక కష్టాలకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఆనాడు విద్యుత్ చార్జీలతో నలిగిపోతున్న ప్రజలకు, రైతులకు అండగా స్వర్గీయ వైఎస్సార్ పెద్ద ఎత్తున ఉద్యమించారు. చంద్రబాబు ఆ ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేసేందుకు ఏకంగా రైతులపై పోలీసులతో కాల్పులు చేయించి, రక్తపాతానికి కారణమయ్యాడు. నేడు రాష్ట్రంలో మరోసారి చంద్రబాబు వల్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేక ప్రజల నడ్డి విరుగుతోంది. వైసీపీ ఆందోళనల ద్వారా ఈ నిర్దాక్షిణ్య పాలనను నిలదీయనున్నాం” అని ఆయన అన్నారు.
నిరసన కార్యక్రమానికి మద్దతు
వైసీపీ ప్రజల ఆవేదనకు అండగా నిలుస్తుందని, ఈనెల 27న జరిగే ఆందోళనలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు.