పులివెందుల పోలీసుల మెడకు చుట్టుకుంటున్న కేసులు

పులివెందుల పోలీసుల మెడకు చుట్టుకుంటున్న కేసులు

వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పలువురు పోలీసు అధికారులపై వరుస ఆరోపణలు వెలుగులోకి రావడంతో వివాదాలు ముదురుతున్నాయి. వైసీపీ కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్‌ను కులం పేరుతో దూషించి, చిత్రహింసలకు గురిచేశారంటూ పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐ ఎన్వీ రమణలపై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ అంశంపై బాధితుడు జాతీమ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ (National Human Rights Commission of India)ను ఆశ్రయించగా, సంబంధిత అధికారులపై నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

అరెస్టులు, థర్డ్ డిగ్రీ ఆరోపణలు
పులివెందులలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలను తొలగించారనే ఆరోపణలపై కిషోర్‌తో పాటు 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. స్టేషన్లు మార్చి తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు ఆరోపిస్తూ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్‌తో పాటు పలువురు కీలక నేతలను కూడా అరెస్ట్ చేశారు.

బాధితుల ఫిర్యాదులో భాగంగా, అధికార పార్టీకి కొమ్ముకాస్తూ కక్షసాధింపుతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అంతటితో ఆగకుండా తమపై రౌడీషీట్ ఓపెన్ చేశారంటూ విన్నవించారు. వేముల పోలీసు స్టేషన్‌లో అర్ధరాత్రి తనను కులం పేరుతో దూషించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పార్నపల్లి కిషోర్ ఆరోపించారు. పోలీసుల తీరుపై కిషోర్ మానవ హ‌క్కుల క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించ‌గా, సంబంధిత అధికారుల‌పై నాలుగు వారాల్లో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశాలిచ్చింది.

ఏసీబీ, ఎక్సైజ్ కేసులు
ఇదిలా ఉండగా, పులివెందుల రూర‌ల్ సీఐ ఎన్వీ రమణ ఇప్పటికే రూ.3 ల‌క్ష‌ల‌ లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటనలో ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అదే కేసులో డీఎస్పీ మురళి నాయక్ ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఓ రోజంతా విచారణ జరిగినట్లు సమాచారం. మరోవైపు, సీఐ రమణ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎక్సైజ్ శాఖ అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసింది. దీనిపై కూడా ఏసీబీ విచారణ కొనసాగుతోంది.

అలాగే, సింహాద్రిపురం ఎస్‌ఐ అనిల్ కుమార్ లంచం వ్యవహారంలో డీఎస్పీ మురళి నాయక్ చెప్పడంతోనే తాను లంచం తీసుకున్నానని ఏసీబీకి వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఏసీబీ కేసులోనూ డీఎస్పీ ఇరుక్కున్నారని ప్రచారం సాగుతోంది.

వరుస వివాదాల్లో అధికారులు
గతంలో “కాల్చిపడేస్తా” అంటూ ప్రజలపై జులుం ప్రదర్శించి వివాదాస్పదంగా మారిన డీఎస్పీ మురళి నాయక్‌పై తాజా మానవహక్కుల కమిషన్ ఆదేశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు మానవహక్కుల కేసు, ఏసీబీ కేసు, ఎక్సైజ్ కేసులతో పులివెందుల పోలీసు అధికారులపై విచారణలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు తీసుకునే చర్యలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment